యాప్నగరం

పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని కడిగిపారేసిన జయదేవ్

చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది.

Samayam Telugu 20 Jul 2018, 12:09 pm
ఇచ్చిన హామీలను నిలుపుకోలోలేని కేంద్రంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నన్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటులో విరుచుకుపడ్డారు. అందుకే తమ రాష్ట్రంలో ధర్మపోరాటానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండాల్సిన పారదర్శక సంబంధాలను మోదీ తీవ్రంగా దెబ్బతీశారని జయదేవ్ ఆరోపించారు. నాలుగు కారణాలతో తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని పేర్కొన్న ఆయన, పారదర్శకత, నమ్మకం, ప్రాధాన్యత, మాట నిలబెట్టుకోవడం అన్న అంశాలపై తమకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని ఉద్ఘాటించారు.
Samayam Telugu గల్లా జయదేవ్


రాష్ట్ర విభజన పారదర్శకంగా జరగలేదని, న్యాయం చేసే విషయంలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని, నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదని దుయ్యబట్టారు. పలు విభజన హామీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. తాను 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నానని అన్నారు.

తెలంగాణలో ఉన్న ఎన్నో విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలున్నాయి.. పాత పేరుతో కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్‌లో అవి లేవని చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, నిర్దయగా విభజించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు జయదేవ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్పీకర్ వారించారు. అలాగే టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు పలకడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

విభజన వల్ల తెలంగాణకు కలిగిన లబ్ధి, ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ ద్రోహం గురించి ఆయన పలు అంశాలను లేవనెత్తారు. ఈ క్రమంలో టీడీపీకి ఇచ్చిన సమయం ఎప్పుడో అయిపోయింది. అయినా సరే గల్లా ప్రసంగం మాత్రం అనర్ఘళంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రామహాజన్ కలగజేసుకుని ఇంకా ఎంతసేపు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇంకెంత సమయం కావాలని అడిగారు. దీనికి సమాధానంగా, ఇది చాలా కీలకమైన సమావేశమని, తాము చెప్పుకోవాల్సింది చాలా ఉందని, అన్నీ వివరించడానికి తనకు మరో గంట కేటాయించాలని అన్నారు. అంత సమయం ఇవ్వడం కుదరదు..ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇస్తానని స్పీకర్ చెప్పారు. దీనికి సమాధానంగా, అవిశ్వాసంపై తీర్మానానికి సంబంధించి గంట కన్నా తక్కువ సయమంలో తమ సమస్యలను చెప్పుకోవడం కుదరదని గల్లా సమాధానం చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.