యాప్నగరం

హ్యాట్సా‌ఫ్ కేరళ.. వరసగా రెండో రోజు ‘0’ కేసులు

Pinarayi Vijayan: భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు నమోదైన కేరళలో వైరస్ వ్యాప్తి పూర్తి నియంత్రణలోకి వచ్చింది. వరసగా రెండో రోజు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. 92.5 శాతం బాధితులు కోలుకోవడం విశేషం.

Samayam Telugu 5 May 2020, 12:09 am
యావత్ దేశం కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వేళ కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది. ఆ రాష్ట్రంలో వరసగా రెండో రోజు కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 34 మంది మాత్రమే కోవిడ్-19కు చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం (మే 4) సాయంత్రం మీడియాకు వెల్లడించారు. సోమవారం 61 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
Samayam Telugu కేరళ కరోనా యోధులు
Kerala


భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స అందించడంతో త్వరగానే కోలుకుంది. ఈ లోగా రాష్ట్రంలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. అప్పటికి దేశంలో నమోదైన ఐదారు కేసుల్లో కేరళ రాష్ట్రానివే 3 కావడం గమనార్హం.

Also Read: తెలంగాణకు భారీ ఊరట.. తగ్గిన కరోనా కేసులు

కేరళలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నట్లే కనిపించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నియంత్రణలోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 499 మంది కరోనా బారిన పడగా.. వైద్యుల కృషితో 462 మంది కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మొత్తం కేసుల్లో ఇది 92.58 శాతం. కేరళలో కరోనా కారణంగా నాలుగు నెలల ఓ పసికందు సహా ముగ్గురు మాత్రమే మరణించారు..

రాష్ట్రంలో ఇప్పటివరకు 33 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సీఎం పినరయి విజయన్ తెలిపారు. వీరిలో 32,315 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. అయితే.. కరోనా కారణంగా 80 మందికి పైగా మలయాళీలు వివిధ దేశాల్లో, రాష్ట్రాల్లో మృత్యువాతపడటం విషాదకర అంశం. ఇది తనను ఎంతో బాధకు గురిచేసిందని ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న లక్షకు పైగా కేరళీయన్లను స్వస్థలాలకు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Don't Miss: దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.