యాప్నగరం

సమాజంలో హింసకు తావులేదు.. వీరుల త్యాగాలను దేశం మరచిపోదు: రాష్ట్రపతి

మహాత్మా గాంధీ బోధించిన అహింస మంత్రం హింస కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. నాగరిక సమాజంలో హింసకు తావు లేదని చెప్పారు.

TNN 14 Aug 2018, 11:45 pm
మహాత్మా గాంధీ బోధించిన అహింసా మంత్రం హింస కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. నాగరిక సమాజంలో హింసకు తావు లేదని చెప్పారు. అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని, త్రివిధ దళాలు, పోలీసులు అన్ని సమయాల్లో బాగా పనిచేస్తున్నారని అన్నారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి కోవింద్ 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
Samayam Telugu Kovind


సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఆయన నివాళులు అర్పించారు. రైతులకు సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కోవింద్ చెప్పారు. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునే కీలక దశలో వివాదాలకు తావు ఇవ్వరాదని దేశ ప్రజలకు ఉద్భోదించారు. మూక దాడుల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ నాగరిక సమాజంలో హింసకు తావు లేదని చెప్పారు.

భారతీయ సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, వారికి నచ్చిన మార్గాన్ని ఎంచుకునే అవకాశం, స్వేచ్ఛ ఉండాలని కోవింద్ పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో పాటు సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ తమ రంగాల్లో విశేష కృషి చేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని కితాబిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.