యాప్నగరం

Third Front ఊసే లేదు.. బీజేపీని ఓడించేది ఒకటే ఫ్రంట్: కుండబద్దలు కొట్టిన నితీశ్

వచ్చే ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేసే బాధ్యతను బిహార్ సీఎం నితీశ్ కుమార్ భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన, టీఎంసీ వంటి విపక్ష పార్టీల నేతలను ఢిల్లీలో కలిశారు. అంతేకాదు, తాను ప్రధాని అభ్యర్థిని కాదంటూనే చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా, హరియాణాలో జరిగిన సమ్మాన్ దివాస్ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడో కూటమిపై ప్రచారాన్ని కొట్టి పారేశారు. బీజేపీని ఓడించేది ఒకటే కూటమని అన్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 Sep 2022, 6:34 pm

ప్రధానాంశాలు:

  • విపక్షాల కూటమి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు
  • బీజేపీయేతర పార్టీలను కలుస్తున్న నితీశ్ కుమార్
  • హరియాణాలో ఐఎన్ఎల్డీ సమ్మాన్ దివాస్ ర్యాలీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నితీశ్ కుమార్
భారత మాజీ ఉప-ప్రధాని దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని హరియాణాలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) నిర్వహించిన సమ్మాన్ దివాస్ (Samman Diwas) ర్యాలీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar), డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejshwi Yadav), ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar), సీపీఎం నేత సీతారాం ఏచూరీ (Sitram Yechuri) సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటికిపై రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని నితీశ్ స్పష్టం చేశారు. అంతేకాదు, మూడో కూటమి (Third Front) ప్రశ్నే లేదని, 2024లో కాషాయ పార్టీని ఓడించడానికి ఉన్నది ఒకే ఒక ఫ్రంట్ అని స్పష్టం చేశారు.
బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేసేందుకు పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని.. హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ ఆరోపించారు. ‘‘జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే నా కోరిక.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలి’’ అని అన్నారు. అంతేకాదు, ప్రధాని రేసులో తాను లేనని మరోసారి నితీశ్ కుమార్ పునరుద్ఘాటించారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రంట్ కోసం బల ప్రదర్శనలో భాగంగా సమ్మాన్ ర్యాలీకి ప్రతిపక్ష నాయకులను (ఐఎన్ఎల్‌డీ) ఆహ్వానించింది. ఈ ర్యాలీకి నితీశ్ కుమార్, శరద్ పవార్, కేసీ త్యాగి, సీతారాం ఏచూరి, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత అరవింద్ సావంత్‌, ఎస్ఏడీ నుంచి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సహా ప్రతిపక్ష అగ్రనేతలు హాజరయ్యారు.

జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన శక్తుల ఏకీకరణకు గుర్తుగా ఇదొక చారిత్రాత్మక సమావేశమని అన్నారు. అయితే, ఈ ర్యాలీకి కాంగ్రెస్ గైర్హాజరయ్యింది. హరియాణాలో INLD, కాంగ్రెస్ బద్ధ శత్రువులు. అయితే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ నిలువరించడానికి కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌ఎల్‌డీ పేర్కొంది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.