యాప్నగరం

నిరుద్యోగం పెరిగితే భారత కథ ముగుస్తుంది: నోబెల్ విజేత

భారత్‌లో నిరుద్యోగంపై ప్రముఖ ఆర్థికవేత, నోబెల్ పురస్కారం గ్రహీత పాల్ క్రూగ్‌మెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 18 Mar 2018, 6:29 pm
భారత్‌లో తయారీ రంగం వృద్ధి చెందకపోతే భారీగా నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం ఉందని నోబెల్ అవార్డు గ్రహీత, అమెరికా ఆర్థిక వేత్త పాల్‌ క్రూగ్‌మెన్‌ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు అనే అంశంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో రోగ నిర్దరణను వైద్యుడు చేసినప్పటికీ, అది దీని పరిధిలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంశాల వల్ల భారత్‌లోని సేవల రంగం తీవ్ర ప్రభావానికి గురవుతుందని క్రూగ్‌మెన్ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్‌పవర్‌గా జపాన్ ఎక్కువ కాలం ఉండలేదని, ఎందుకంటే అక్కడ పనిచేసే జనాభా తగ్గిపోవడమే దీనికి కారణమన్నారు. చైనాలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu nobel winner paul krugman warns india story could end with mass unemployment
నిరుద్యోగం పెరిగితే భారత కథ ముగుస్తుంది: నోబెల్ విజేత


ఆసియాలో ఈ స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుంది, కానీ కేవలం సేవల రంగం మీద ఆధారపడకుండా ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేయాలని క్రూగ్‌మెన్ సూచించారు. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా భారతదేశంలో ఉత్పాదక రంగం వృద్ధి చెందితే, వారికి ఉపాధి కల్పన మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే భారత్‌లో పెరుగుతోన్న జనాభా ప్రపంచీకరణను తీవ్రంగా ప్రభావితం చేయగలదని అన్నారు. ప్రస్తుత యువతరం ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించగలరు కానీ వారందరికి ఉద్యోగాలు చూపగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని నోబెల్ విజేత వ్యాఖ్యానించారు.

భారత వృద్ధి చాలా ప్రత్యేకమైంది.. ప్రపంచీకరణలో సేవల రంగం వృద్ధి చెందుతున్నట్టు భారత్‌లో తప్ప ప్రపంచంలోని ఎక్కడా కనిపించడ లేదని అన్న క్రూగ్‌మెన్, ప్రపంచీకరణలో ఇది చాలా కీలకమైందని అన్నారు. దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ప్రత్యేకంగా భారత్ పురోగతి సాధించడానికి ముఖ్యకారణమని ఆయన తెలియజేశారు.

అంతేకాకుండా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో పెరుగుతున్న మధ్యతరగతి ఆదాయం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అందరూ చైనా గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు... కానీ ఇండియా కూడా అందులో భాగమేనన్నారు. భారత్ ఇప్పటికీ పేద దేశమే అయినా, అదే స్థాయిలో ఉండిపోదని... భారత జీడీపీ శరవేగంగా వృద్ధి చెంది, వ్యాపార అనుకూల కేంద్రంగా మారిందని ప్రశంసించారు. కొనుగోలు శక్తి ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిదని క్రూగ్‌మెన్ తెలిపారు.

భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును నమోదు చేసిందని, దీనికి కారణం పనిచేసే వారి సంఖ్య పెరగడమేనని అన్నారు. జపాన్‌ నుంచి ఇటలీ, చైనా లాంటి దేశాలు మానవవనరుల లేమితో సతమతమవుతుంటే, భారత్‌కు ఆ సమస్య లేదని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పించే విషయమై ప్రధాని మాట్లాడుతున్నారని, ఇలాంటి ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.