యాప్నగరం

Odisha: ఛాతీ లోతు వరద నీటిలోంచి మృతదేహం తరలింపు

ఒడిశా రాష్ట్రంలో (Odisha) దారుణమైన పరిస్థితి చోటుచేసుకుంది. బెహెరాగూడ గ్రామంలో వాగుపై వంతెన లేకపోవడంతో అక్కడి గ్రామస్థులు నానా పాట్లు పడుతున్నారు. ఎడవతెరిపి లేని వర్షాల కారణంగా గత కొన్ని రోజులు వరద నీరు పోటెత్తుతుంది. దాంతో వాగుపై వంతెన లేకపోవడంతో దానిని దాటడం పెద్ద సవాల్ అయింది. తాజాగా ఊర్లో ఓ వ్యక్తి చనిపోవడంతో.. అతని అంత్యక్రియలు నిర్వహించడం చాలా కష్టతరమైంది. ఛాతీలోతు వరద నీటిలో మృతదేహాన్ని తరలించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 12 Aug 2022, 2:49 pm

ప్రధానాంశాలు:

  • బెహెరాగూడలో దారుణ పరిస్థితి
  • వంతెన లేక అవస్థలు పడుతున్న జనం
  • వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu cremation
Odisha: సరైన రహదారులు.. రవాణా సదుపాయం.. నదులపై వంతెనలు లేక ఎన్నో గ్రామాల్లో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాలను చేసుకోవడానికి పెద్ద పెద్ద సాహసాలు చేయాల్సి వస్తుంది. ఒడిశా రాష్ట్రంలోని బెహెరాగూడ గ్రామంలో వాగుపై వంతెన నిర్మించకపోవడంతో అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా గ్రామంలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఛాతీ లోతు వరద నీటిలో బంధువులు మృతదేహాన్ని భుజాలపై మోసుకువెళ్లాల్సి వచ్చింది.
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కలహండి జిల్లాలోని గోలముండా బ్లాక్‌లో ఒక ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దానిపై వంతెన లేదు. దాంతో ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి బెహెరాగూడ గ్రామ నివాసితులు చాలా కష్టపడ్డారు. గ్రామంలో శాంతారాణా చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతూ మంగళవారం చనిపోయారు. దాంతో అతని మృతదేహానికి దహన సంస్కారం చేయడం పెద్ద సవాల్ అయింది. వాగుకు అవతలి వైపు శ్మశాన వాటిక ఉంది. దాంతో వాగులోంచి ఛాతీ లోతు నీటిలోంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే అప్పుడు కూడా వర్షం పడతుండడంతో మృతదేహం తడవకుండా అరటి ఆకులను అడ్డంగా పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా ఒడిశాలో దహన సంస్కారాల ఖర్చులను భరించలేని నిరుపేదల కోసం ఒడిశా ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం హరిశ్చంద్ర సహాయత యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించడానికి రెండు వేల రూపాయలను అందజేసింది. అయితే ఈ పథకం కింద అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

కాగా ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో స్మశానం లేకపోవడంతో నడిరోడ్డుపైనే ఓ వ్యక్తి అంత్యక్రియలను నిర్వహించాల్సి వచ్చింది. భింద్‌లోని మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అజ్నాల్ గ్రామంలో ఎప్పటి నుంచో స్మశానం లేదు. ఎవరైనా చనిపోతే సొంత పొలాల్లోనే గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షాల వల్ల గ్రామంలోని పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. దాంతో గ్రామంలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు వేరే మార్గం లేకపోయింది. అందుకని నడిరోడ్డుపైనే దహన సంస్కారాన్ని నిర్వహించారు. ఎప్పటి నుంచో తమ సమస్యను ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేస్తున్నామని కానీ వారు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామంలో ఒక స్మశానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also:ఆకట్టుకుంటున్న జెండా... కూరగాయల వ్యాపారి క్రియేటివిటికి ఫిదా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.