అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమ కళ్ల ముందే మరణానికి చేరువైతే ఆ తల్లిదండ్రుల ఆవేదనను మాటల్లో వర్ణించలేం. తమ గారాల పట్టి ఇక తిరిగి రాదని తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు కరిగిపోతున్న తమ కూతురి జీవితం కొందరి జీవితాల్లోనైనా వెలుగులు నింపాలని భావించారు. వారిలో తమ కూతుర్ని చూసుకోవాలని ఆశించారు. అందుకే ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. తమిళనాడులోని ఈరోడ్లో జరిగిన ఈ సంఘటన అవయవదానం గొప్పదనాన్నిమరోసారి చాటిచెప్పింది. వివరాల్లోకి వెళితే..
ప్లస్ టూ చదువుతోన్న పుమ(21) కుటుంబం బెంగళూరులో నివాసం ఉంటోంది. కుటుంబ సభ్యులు నలుగురు పొల్లాచిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై బెంగళూరు ప్రయాణమయ్యారు. ఈరోడ్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడగా, పుమ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో తమ కూతురి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి అనుమతితో డాక్టర్లు పుమ ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, చర్మం, గుండె, కళ్లను తీసుకున్నారు. ఆమె అవయవాలను అమర్చడం వల్ల మరో ఆరుగురికి పునర్జన్మ లభించినుంది. తమ కూతురు చనిపోయినప్పటికీ ఆమె శరీర భాగాలు నలుగురికి ఉపయోగపడాలని భావించిన పుమ తల్లిదండ్రులు ఆదర్శప్రాయులు.