యాప్నగరం

Amritpal Singh: దుబాయ్‌లో బ్రెయిన్ వాష్.. జార్జియాలో శిక్షణ.. అంతా ఐఎస్ఐ కనుసన్నల్లోనే

Amritpal Singh దేశంలో అలజడికి కారణమైన ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌‌ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అతడ్ని అరెస్ట్‌ చేసే వరకు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం బైక్‌పై పారిపోతున్న అమృత్‌పాల్‌ సింగ్‌‌ను పోలీసులు 20-25 కిలోమీటర్ల దూరం వెంబడించారని, అయినా తప్పించుకుని పారిపోయాడు. అయితే, అతడు ఎక్కడ ఉన్నదీ ఇంత వరకూ ఆచూకీ తెలియరాలేదు. మూడు రోజుల నుంచి పంజాబ్ మొత్తం గాలిస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 20 Mar 2023, 2:11 pm

ప్రధానాంశాలు:

  • ఖలీస్థాన్ వేర్పాటువాదుల వెనుక పాకిస్థాన్
  • ఐఎస్ఐ‌ ప్లాన్ ప్రకారమే భారత్‌కు అమృత్‌పాల్‌
  • ప్రత్యేకంగా ప్రయివేట్ సైన్యం ఏర్పాటు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Warris Punjab De Amritpal Singh
Amritpal Singh ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు దేశం విడిచి పారిపోయేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అమృత్‌పాల్‌ సింగ్‌ నేపాల్‌ మీదుగా కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. తన బంధువుల వ్యాపార సంస్థలో ఉద్యోగం కోసం చాలా కాలం దుబాయ్‌లో ఉన్న అమృత్‌పాల్‌కు అక్కడే పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్లతో పరిచయాలు ఏర్పడ్డాయి.
అతడిని పావుగా వాడుకుని పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి ఐఎస్ఐ వ్యూహరచన చేసినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదేళ్ల కిందట 2012లో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేందుకు అమృత్‌పాల్‌ దుబాయ్‌ వెళ్లాడు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్‌ నేత లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే సోదరుడు జస్వంత్‌, ఉగ్రవాది పరమ్‌జీత్‌ సింగ్‌ పమ్మాతో అక్కడే పరిచయం ఏర్పడింది. దుబాయ్‌లో అతడికి ఐఎస్‌ఐ బ్రెయిన్ వాష్‌ చేసింది. ఆ తర్వాత భారత్‌ రావడానికి ముందు అమృత్‌పాల్‌ జార్జియాకు వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడికి ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో అక్కడే శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో అలజడి రేపడానికి పక్కా వ్యూహాంతోనే దేశంలోకి అడుగుపెట్టాడు.

నటుడు దీప్ సిద్ధూ హత్య అతడికి అనుకూలంగా మారింది. నాయకత్వ లేమితో సతమతమవుతోన్న ‘వారిస్‌ పంజాబ్‌ దే’ను హైజాక్‌ చేశాడు. అక్కడి నుంచి మెరుపు వేగంతో ఎదిగిన అమృత్‌పాల్‌కు.. సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచూ పంజాబ్‌లోకి చొరబడే డ్రోన్ల ద్వారా అమృత్‌పాల్‌కు అవసరమైన ఆయుధాలు పాకిస్థాన్ అందజేసినట్టు అనుమానిస్తున్నారు. అమృత్‌పాల్‌కు యూకేలో ఉంటున్న అవతార్‌ సింగ్‌ ఖండా ప్రధాన హ్యాండిలర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

ఉగ్రవాది పమ్మా, అవతార్‌ సింగ్‌‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఏడాది కిందటి వరకూ అనామకుడిగా ఉన్న అమృత్‌పాల్‌ ఎదుగుదల వెనుక అవతార్‌ ప్లాన్లు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అమృత్‌పాల్‌ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. దీప్‌ సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ జీవితమే మారిపోయింది. ‘వారిస్‌ పంజాబ్‌ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకొన్నాడు.

ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌ (ఏకేఎఫ్‌) పేరుతో అమృత్‌పాల్‌ సొంతగా ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పేరుతో ఉన్న జాకెట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. జల్లూపూర్‌ ఖేడా గ్రామంలోని అమృత్‌పాల్‌ ఇంటిపై ఏకేఎఫ్‌ అని రాసి ఉండటాన్ని దళాలు గుర్తించాయి. దీనికి తోడు నిన్న అమృత్‌పాల్‌ వాహనం నుంచి తూటాలు, తుపాకులను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దళం సహకారంతోనే అజ్‌నాలా స్టేషన్‌పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.