యాప్నగరం

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ భారత పర్యటనకు ఆహ్వానం.. విదేశాంగశాఖ ప్రకటన

Imran Khan: భారత్-పాకిస్థాన్ మధ్య గత మూడేళ్లుగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ పొరుగు దేశంపై తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఉరీలోని సైనిక శిబిరంపై ఉగ్రదాడులు, అందుకు ప్రతిగా భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.

Samayam Telugu 16 Jan 2020, 7:45 pm
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు రానున్నారు. ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో నిర్వహించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన్ను ఆహ్వానిస్తామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఎస్‌సీఓలో పాక్‌తో పాటు 8 సభ్యదేశాలు ఈ సదస్సుకు హాజరుకానున్నాయని తెలిపారు.
Samayam Telugu pakistan pm imran khan will be invited to india for sco summit in delhi
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ భారత పర్యటనకు ఆహ్వానం.. విదేశాంగశాఖ ప్రకటన


విలేకరులతో రవీశ్ కుమార్

గురువారం ఢిల్లీలో రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఎస్‌సీఓ సదస్సు కోసం భారత్ అతిథ్యం ఇవ్వనుంది. నియమ నిబంధనల ప్రకారం.. ఇందులో సభ్యులుగా ఉన్న ఎనిమిది దేశాలు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావాలి.’’ అని తెలిపారు.

ఎస్‌సీఓ అంటే..

ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో సహకారం కోసం చైనా నాయకత్వంలో ఎస్‌సీఓ పని చేస్తుంది. ఇందులో పాకిస్థాన్, భారత్ 2017లో చేరాయి. 2001లో రష్యా, చైనా, కిర్గిక్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలు ఎస్‌సీఓను స్థాపించాయి. గతేడాది జూన్‌లో కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కేక్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సుకు భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు నిధులు సమకూర్చుతున్న దేశాలే ఇందుకు బాధ్యత వహించాలని ఆ సందర్భంగా ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్ఫర సహకారం అందించుకోవాలని సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు.

వివాదాల నడుమ భారత్‌కు ఇమ్రాన్!

భారత్-పాకిస్థాన్ మధ్య గత మూడేళ్లుగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ పొరుగు దేశంపై తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ఉరీలోని సైనిక శిబిరంపై ఉగ్రదాడులు, అందుకు ప్రతిగా భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. గతేడాది భారత సైన్యం ప్రయాణిస్తున్న వాహనాలపై పాకిస్థాన్ బాంబు దాడులకు పాల్పడడంతో భారత్, బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో భారత్ నాశనం చేసింది. తర్వాత కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి.

చర్చలను తిరస్కరిస్తూ వస్తున్న భారత్

ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శాంతి స్థాపన కోసం చర్చలకు ఆహ్వానించినా భారత్ అందుకు తిరస్కరిస్తూ వస్తోంది. రెండేళ్ల క్రితం ఐక్య రాజ్యసమితి సమావేశాల సందర్భంగా అమెరికాలో పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీతో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య జరగాల్సిన భేటీని కూడా భారత్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే ఎన్‌సీఓ సదస్సుకు ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.