యాప్నగరం

మోదీతో భేటీ అయిన పన్నీర్ సెల్వం !

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత...

TNN 14 Aug 2017, 6:28 pm
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే పార్టీని తిరిగి ఐక్యం చేసే అంశంపై ఓపీఎస్ మోదీతో చర్చించారు. అన్నాడీఎంకే పార్టీలోనే ప్రస్తుత సీఎం పళనిస్వామి నాయకత్వంలో ఒక వర్గం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం నాయకత్వంలో మరో వర్గం వేర్వేరుగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం పదవిని దక్కించుకోవడం కోసం ఏర్పడిన పోటీలో రెండుగా విడిపోయిన ఈ రెండు వర్గాలని తిరిగి ఏకం చేయడంతోపాటు నీట్, తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగినట్టు ఈ భేటీలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు వి మైత్రేయన్ తెలిపారు.
Samayam Telugu panneerselvam meets modi
మోదీతో భేటీ అయిన పన్నీర్ సెల్వం !


సమావేశం అనంతరం ఈ భేటీకి సంబంధించిన వివరాలని మీడియాకు వెల్లడించిన మైత్రేయన్.. పన్నీర్‌సెల్వం, మోదీల మధ్య అర్ధగంటకుపైగా చర్చ జరిగినట్టు చెప్పారు. రాష్ట్ర మాజీ మంత్రి కేపీ మునుస్వామి, రాజ్యసభ మాజీ సభ్యుడు మనోజ్ పాండ్యన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గత శుక్రవారం పళనిస్వామి మోదీని కలిసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అదే రోజు పన్నీర్ సెల్వం కూడా ప్రధానితో భేటీ అవ్వాల్సి వున్నప్పటికీ ఆరోజు భేటీ అవడం సాధ్యపడలేదు.

ఇదిలావుంటే, మరోవైపు ఇదే పార్టీలో మూడో వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకే(అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ ధినకరణ్ వీళ్ల విలీనం ప్రతిపాదనకి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పార్టీకి చెందిన 20 మందికిపైగా ఎమ్మెల్యేలు తనతో వున్నారన్న ధినకరణ్.. అందులో కొంతమంది పళనిస్వామి కేబినెట్‌లో మంత్రులుగా వున్నారని స్పష్టంచేశారు. దీంతో పార్టీలో ఇరువర్గాలు విలీనమవుతున్న ప్రస్తుత తరుణంలో ధినకరణ్‌కి ఎంత మంది మద్దతు ఇస్తారు ? ఎంతమంది తమ మనసు మార్చుకుంటారు అనే చర్చ జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.