యాప్నగరం

SPG సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. తొలి ఎఫెక్ట్ మోదీపైనే!

నవంబర్ 27న లోక్ సభలో ఆమోదం పొందిన ఎస్పీజీ సవరణ బిల్లు మంగళవారం రాజ్య సభలోనూ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందగానే.. ఈ బిల్లు చట్టహోదాను పొందుతుంది.

Samayam Telugu 3 Dec 2019, 6:34 pm
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సవరణ బిల్లు, 2019 మంగళవారం సాయంత్రం రాజ్యసభలో ఆమోదం పొందింది. గత వారం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో.. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటమే తరువాయి.. సవరణలతో కూడిన ఎస్పీజీ చట్టం అమల్లోకి వస్తుంది. రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో.. సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ కవర్‌ను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది.
Samayam Telugu అమిత్ షా


గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించడానికే ఈ బిల్లును తీసుకొచ్చారన్న ఆరోపణలు అమిత్ షా ఖండించారు. గాంధీ కుటుంబాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఎస్పీజీ బిల్లు తీసుకొచ్చామనడం నిజం కాదని షా తెలిపారు. ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే.. ఈ బిల్లును తీసుకురావడానికి ముందే.. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించామన్నారు.

ఎస్పీజీ చట్టానికి ఇది ఐదో సవరణ అని చెప్పిన అమిత్ షా.. గతంలో నాలుగు సవరణలు మాత్రం ఒకే ఒక కుటుంబాన్ని (గాంధీ) దృష్టిలో ఉంచుకొని జరిగాయన్నారు. తాజా సవరణ ద్వారా ఎక్కువ ప్రభావితం అయ్యేది ప్రధాని మోదీ అని హోం మంత్రి తెలిపారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ఐదేళ్ల తర్వాత ఆయనకు ఎస్పీజీ భద్రత ఉపసంహరిస్తారని ఆయన చెప్పారు.

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత మాత్రమే కావాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తోందని అమిత్ షా ప్రశ్నించారు. భద్రత అనేది స్టేటస్ సింబల్ కాదన్న హోం మంత్రి.. ఎస్పీజీ భద్రత అనేది దేశాన్ని నడిపే వారికి మాత్రమే పరిమితమన్నారు. అందరికీ ఎస్పీజీ భద్రత ఇవ్వలేమన్న ఆయన.. మేం ఒక కుటుంబానికి వ్యతిరేకం కాదు. కానీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు.

మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్, దేవేగౌడ, మన్మోహన్ సింగ్‌లకు సెక్యూరిటీ కవర్‌ను ప్రభుత్వం తొలగించినప్పుడు ఎలాంటి వివాదం తలెత్తలేదన్నారు.

ఎస్పీజీ సవరణ బిల్లు ప్రకారం.. ఇక నుంచి అత్యున్నత స్థాయి ఎస్పీజీ భద్రత కేవలం ప్రధాని, ఆయనతోపాటు అధికారిక నివాసంలో నివసించే కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. మాజీ ప్రధానులు, ఆయనతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు ప్రధాని పదవి నుంచి వైదొలిగిన ఐదేళ్ల వరకు ఎస్పీజీ భద్రత కల్పిస్తారు. ఎస్పీజీ బిల్లుకు లోక్ సభ నవంబర్ 27న మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.