యాప్నగరం

ఎంపీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: వెంకయ్య

ఎంపీల ప్రవర్తన పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నవ్వుకుంటున్నారని, పార్లమెంట్ ప్రతిష్ట మసకబారుతోందని అన్నారు.

Samayam Telugu 2 Jan 2019, 11:30 pm
రాజ్యసభలో సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై సభా ఛైర్మన్, ఉపరాష్ట్రపతి‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక అంశాలపై చర్చలు జరగకుండా సభ్యులు అడ్డుపడుతున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభలు పలు అంశాలపై చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆయన బుధవారం (జనవరి 2) రాజ్యసభలో మాట్లాడారు.
Samayam Telugu Venkaiah


‘మరో ఐదు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి. కానీ, సభలో దేని గురించి చర్చ జరగకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభా కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడం వల్ల ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇది పార్లమెంటు ప్రతిష్టను మసకబారుస్తోంది’ అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

‘దయచేసి సభ సజావుగా జరిగేందుకు సహకరించండి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ట్రిపుల్ తలాక్‌, రఫేల్‌ ఒప్పందం లాంటి కీలక అంశాల గురించి చర్చ జరగాల్సి ఉంది. కొన్ని తీర్మానాలను ఆమోదించేందుకు సహకరించండి’ అంటూ వెంకయ్య నాయుడు సభ్యులనుద్దేశించి అన్నారు.

డిసెంబరు 11న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు జనవరి 8తో ముగియనున్నాయి. కావేరీ జలాల అంశం, రఫేల్‌ ఒప్పందాల గురించి కాంగ్రెస్‌, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన కొనసాగిస్తుండటంతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అన్నాడీఎంకే నేతలు నిరసనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.