యాప్నగరం

Petrol Diesel Prices: లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.15 తగ్గింపు.. కారణం ఇదే!

Petrol Diesel Prices: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరను రూ. 2 తగ్గించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరను రూ.15 తగ్గిస్తూ సరికొత్త నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. కానీ..!

Authored byశివరామచారి తాటికొండ | Samayam Telugu 18 Mar 2024, 5:56 pm
Petrol Diesel Prices: వాహనదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌-ఐఓసీ గుడ్ న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌కు ఏకంగా రూ.15 తగ్గిస్తూ సంచలన నిర్ణయం వెలువరించింది. అయితే ఇది దేశవ్యాప్తంగా కాదు. కేవలం లక్షద్వీప్ దీవుల్లో మాత్రమే ఈ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వర్తించనుంది. మారుమూల ద్వీపాలకు పెట్రోల్, డీజిల్ ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసిన సొమ్మును తిరిగి తెచ్చుకునేందుకు ఆ ప్రాంతంలో గతంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. అయితే తాజాగా ఆ ధరలను భారీగా తగ్గించింది.
Samayam Telugu Petrol Diesel Prices


ఇక లక్షద్వీప్‌లోని పలు దీవుల్లో ఈ తగ్గింపు వేర్వేరుగా ఉంది. కొన్ని దీవుల్లో రూ.15 తగ్గింపు ఉండగా.. మరికొన్ని దీవుల్లో ఆ తగ్గింపు కేవలం రూ.5 మాత్రమే ఉంది. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో లీటర్‌ పెట్రోల్, డీజిల్ ధర రూ.15.3 ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తగ్గించింది. అదే సమయంలో కవరత్తి, మినీకాయ్ దీవుల్లో రూ.5.2 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది.

ఈ తగ్గింపు కారణంగా కవరత్తి, మినీకాయ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.94 నుంచి రూ.100.75కి పడిపోయింది. అదే సమయంలో అందరోట్‌, కల్పేని దీవుల్లో రూ.116.13 నుంచి రూ.100.75 కి తగ్గించింది. కవరత్తి, మినీకాయ్‌ దీవుల్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.110.91 నుంచి రూ.95.71కి తగ్గింది. అందరోట్‌, కల్పేని దీవుల్లో లీటర్‌ రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లక్షద్వీప్‌లోని నాలుగు దీవులైన కవరత్తి, మినీకాయ్, ఆండ్రోట్, కల్పేని దీవులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తోంది.

ఇక కవరత్తి, మినికాయ్‌ దీవుల్లో ఐఓసీకి ఆయిల్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోలకు కొచ్చి నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా సాగుతుంది. లక్షద్వీప్‌, కరత్తి, మినీకాయ్‌ దీవుల్లో కూడా ఆయిల్ డిపోలు నిర్మించగా.. వాటిని నిర్మించేందుకు ఖర్చు చేసిన డబ్బును వెనక్కి తెచ్చుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు ఏకంగా రూ.6.90 పెంచింది. డిపో నిర్మాణాల ఖర్చును గత 3 ఏళ్లుగా ఐఓసీ రికవరీ చేస్తోంది. మూలధన వ్యయం పూర్తిగా రికవరీ అయ్యిందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. దాంతో పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
రచయిత గురించి
శివరామచారి తాటికొండ
శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.