యాప్నగరం

వరస ఓటములతో పంతం వీడిన మోదీ.. అద్వాణీతో చర్చలు!

కర్ణాటకలో చేదు అనుభవం, ఉప ఎన్నికల ఫలితాల్లో షాక్ తర్వాత ప్రధాని మోదీ తన పంతం వీడినట్టు కనిపిస్తోంది. బీజేపీకి మళ్లీ గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉందని మోదీ, అమిత్ షా ద్వయం అప్రమత్తం అవుతున్నారు.

TNN 7 Jun 2018, 1:57 pm
కర్ణాటకలో చేదు అనుభవం, ఉప ఎన్నికల ఫలితాల్లో షాక్ తర్వాత ప్రధాని మోదీ తన పంతం వీడినట్టు కనిపిస్తోంది. బీజేపీకి మళ్లీ గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉందని మోదీ, అమిత్ షా ద్వయం అప్రమత్తం అవుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం శక్తులన్నింటినీ ఏకం చేసే పనిలో పడ్డారు. సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో అరుదైన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్ షా.. మహారాష్ట్రలో బద్ధశత్రువుగా మారుతున్న ఉద్ధవ్ ఠాక్రేను కలిసే ప్రయత్నం చేస్తుండగా.. గతంలో సీనియర్లు అని పక్కనబెట్టిన దిగ్గజ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో మోదీ ఉన్నారు.
Samayam Telugu Advani


గత కొన్ని రోజులుగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూస్తుండటంతో.. ఈ ప్రభావం 2019 ఎన్నికలపై పడకుండా వ్యూహాలు రచిస్తున్నారు మోదీ. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తున్నారు. వయసు నిబంధనలను పక్కనపెట్టి ఎల్‌కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్‌ నేతలను ఎన్నికల బరిలో నిలబెట్టాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం.

2019 ఎన్నికల్లో ఎల్‌కే అద్వాణీ పోటీ చేస్తే బాగుంటుందని ప్రధాని మోదీ అభిప్రాయపడుతున్నట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఆయనతో పాటు మురళీ మనోహర్‌ జోషి లాంటి అగ్రనేతలను కూడా బీజేపీ బరిలోకి దించాలని చూస్తున్నట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. ఈ విషయమై ప్రధాని మోదీ ఇప్పటికే అద్వాణీని కలిసినట్లు తెలిపాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కూడా అద్వాణీని కలిసి చర్చలు జరిపినట్లు కథనంలో రాసుకొచ్చారు.

75 ఏళ్ల పైబడిన నేతలను ఎన్నికలు, పదవులకు దూరంగా ఉంచాలని బీజేపీ గతంలో అనధికారికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక మోదీ, అమిత్ షా ద్వయానిదే కీలక పాత్ర. అయితే గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆ నిబంధనను సడలిస్తూ వస్తోంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వయసు నిబంధనను పక్కనబెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పను ఎన్నుకొంది. తాజాగా అద్వాణీ, జోషీని వచ్చే ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది.

ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం ఏర్పడిన నేపథ్యంలో సీనియర్ నేతల సేవలు ఉపయోగపడతాయని కూడా మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయేకు దూరమవగా.. శివసేన, మరిన్ని మిత్ర పక్షాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్‌ నేతలను మళ్లీ ఎన్నికల కార్యకలపాల్లో భాగం చేయడంతో వారు బీజేపీ, మిత్రపక్షాల మధ్య వారధిగా పనిచేస్తారని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.