పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా...చర్చలు సాగడం లేదు. పెద్దనోట్లను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళనతో లోక్ సభ, రాజ్యసభలు స్తంభిస్తూ వచ్చాయి. నోట్లరద్దు అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా...మోదీ ఇప్పటి వరకు నోరు మెదపలేదు.
అటు సోమవారం తిరిగి సమావేశం కానున్న పార్లమెంటుకు సభ్యులందరూ విధిగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్లు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి.
లోక్సభలో ప్రతిపక్షాలు మాట్లానివ్వనందుకే తాను జన సభల్లో మాట్లాడుతున్నానని మోదీ అన్నారు. అయితే పీఎం పార్లమెంటులో మాట్లాడాలనే తాము ఆందోళన చేస్తున్నామని..ఆయనను ఎవరూ అడ్డుకోవడం లేదని కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీలు ఎదురుదాడికి దిగాయి.
ఈ నేపథ్యంలో సోమవారం సభలో నోట్లరద్దుపై పలువురు ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
నోట్లరద్దుపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షం కాంగ్రెస్ సభలో ఇబ్బంది పెట్టాలని భావిస్తే..తాము కాంగ్రెస్ హయంలో చోటు చేసుకున్న అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంపై ఎదురుదాడికి దిగేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. సభను పక్కదారి పట్టించడానికి అగస్టా అంశాన్ని సభలో ప్రస్తావించే అవకాశం ఉందని కాంగ్రెస్ అంటోంది.
హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులో రూ.450కోట్ల కుంభకోణానికి తెరలేపిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజు వ్యవహారం తాము తేలుస్తామని ధీమాగా చెబుతోంది. ఈ అంశంలో మిగతా ప్రతిపక్షాల మద్దతు కోరుతోంది.
అయితే కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు మాత్రం..సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నారు.