యాప్నగరం

నాడు వారణాసి.. నేడు నరక ద్వారం నుంచి మోదీ ఎన్నికల ప్రచారం

గత సాధారణ ఎన్నికల్లో ముక్తిని ప్రసాధించే పుణ్యక్షేత్రం వారణాసి నుంచి సమర శంఖం పూరించిన నరేంద్ర మోదీ, అఖండ విజయం సాధించి ప్రధాని అయ్యారు.

Samayam Telugu 26 Jun 2018, 1:07 pm
గత సాధారణ ఎన్నికల్లో ముక్తిని ప్రసాధించే పుణ్యక్షేత్రం వారణాసి నుంచి సమర శంఖం పూరించిన నరేంద్ర మోదీ, అఖండ విజయం సాధించి ప్రధాని అయ్యారు. అయితే, 2019 ఎన్నికల కోసం 'నరక ద్వారం'గా పేరున్న మఘర్‌ను ఎంపిక చేసుకున్నారు. కబీర్ దాస్ మహాపరినిర్వాణం చెందిన స్థలం నుంచే 2019 ఎన్నికల శంఖారావం పూరించి, ఆయన ఇచ్చిన హిందూ ముస్లిం ఐక్యతా సందేశాన్ని మరోసారి గుర్తుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం మఘర్‌లో జరిగే భారీ ర్యాలీలో ప్రధాని పాల్గోనున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో‌కు 250 కిలోమీటర్ల దూరంలో గోరఖ్‌పూర్ జాతీయ రహదారిపై మఘర్ ఉంది. గురువారం మఘర్‌కు వెళ్లనున్న ప్రధాని, కబీర్ సమాధుల వద్ద నివాళులు అర్పించనున్నారు. అ సమాధులను హిందువులు, ముస్లింలు సైతం దర్శించుకుంటారు.
Samayam Telugu మఘర్ కబీర్ సమాధి


క్రీ.శ 1399లో వారణాసిలో జన్మించిన కబీర్ 120 సంవత్సరాల తరువాత అంటే 1518లో మఘర్‌ వద్ద తుదిశ్వాస విడిచారు. ఆయన 620వ జయంత్యుత్సవాలను, 500వ వర్థంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని మోదీ ఇప్పటికే నిర్ణయించారు. తన పర్యటనలో భాగంగా మోదీ.. కబీర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. పదిహేనో శతాబ్దానికి చెందిన కబీర్, మఘర్‌లో మరణిస్తే నరకానికి వెళతారన్న నమ్మకం ప్రజల్లో ఉన్నప్పటికీ, ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. ‘వారణాసి అయినా, మఘర్ అయినా నాకు ఒక్కటే. నా మనసులో రాముడు ఉన్నాడు. నేను వారణాసిలో మరణించి మోక్షం పొందినట్లయితే, రాముడిని ఆరాధించడం వల్ల నాకు కలిగిన లాభమేంటి?’ అని ప్రశ్నిస్తూ, కబీర్ మఘర్‌లో నిర్యాణం చెందారు.

జీవిత చరమాంకంలో అక్కడే గడిపి కాశీలో ప్రాణాలు విడిస్తేనే మోక్షం లభిస్తుందనే పండితుల వాదన తప్పని నిరూపించారు. తన భక్తుడైన నవాబ్ బిజిలీ షా పఠాన్‌తో కలిసి 1515లో మఘర్‌కు వచ్చిన కబీర్ 1518లో పరమపదించారు. దీంతో ఆయన మహాపరినిర్యాణం చెందిన మఘర్ కబీర్ అనుచరులకు పుణ్యక్షేత్రంగా మారింది. దోహాలు అనే పుస్తకాన్ని రాసిన కబీర్, అందులో ఐక్యత, శాంతి, సోదరభావం గురించి పేర్కొన్నారు. అయితే కబీర్ మరణించిన తర్వాత అంతిమ సంస్కారాల విషయంలో హిందూ, ముస్లింల మధ్య పెద్ద వివాదమే తలెత్తింది. కబీర్‌కు దహన సంస్కారాలు జరిపించాలని హిందువులంటే, కాదు ఆయనను సమాధి చేయాలని ముస్లింలు గొడపడ్డారు.

ఈ వివాదంలో ముస్లింల తరఫున మఘర్ నవాబ్ బిజ్లీ షా, హిందువుల తరఫున వారణాశి పాలకుడు రాజా వీర్ సింగ్ బాఘేలా నాయకత్వం వహించారు. వారి మధ్య వివాదం నడుస్తుండగా.. కబీర్ భౌతికకాయం నుంచి ఓ వాణి వినిపించింది. ఎవరూ గొడవపడకుండా తన పార్ధివదేహంపై కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించి చూడమని చెప్పింది. ఆ వస్త్రాన్ని తొలగించి చూడగా ఆయన శరీరం స్థానంలో రెండు పుష్పాలు కనిపించాయి. దీంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు.

ఈ రెండింటిలో ఒకటి హిందువులు, మరొకటి ముస్లింలు తీసుకుని, తమ మతాచారాల ప్రకారం వాటికి అంత్యక్రియలు నిర్వహించారు. అందుకే ఇక్కడ ముస్లిం సంప్రదాయంలో మసీదు, హిందూ సంప్రదాయంలో సమాధి దర్శనమిస్తాయి. అయితే మఘర్‌ను నరక ద్వారంగా పిలవడానికి బలమైన కారణం ఉంది. కొన్ని వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతమంతా బంజరు భూములతో భయంకరంగా ఉండేది. ఈ మార్గంలో ప్రయాణించేవారిని దొంగలు దోచుకుని హతమార్చేవారు. దీంతో ఆ దారిలో వెళ్లడానికి జనం భయపడేవారు. ఇలాంటి సంఘటనలతో మఘర్‌ను ‘నరక ద్వారం’గా నాటి పండితులు అభివర్ణించారు.

మోదీ పర్యటనపై స్పందించిన సంత్ కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠి, ఈ పర్యటన కబీర్ 500వ వర్థంతి సందర్భంగా జరుగుతుండటం యాదృశ్చికమేనని, ఆయన కూడా 'సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్' నినాదాన్ని ప్రచారం చేశారని, ఇప్పుడు ప్రధాని కూడా అదే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంతో కాలం పాటు వెనుకబడిపోయిన మఘర్ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ప్రధాని పర్యటన కోసం మఘర్ ప్రస్తుతం సుందరంగా ముస్తాబవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.