యాప్నగరం

దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని మోదీ భావిస్తున్నారు: కర్ణాటక మంత్రి

Karnataka minister Umesh Katti: 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మదింపు చేస్తుండగా తనకు తెలిసిందని ఆయన అన్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 25 Jun 2022, 3:49 pm
దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ కర్ణాటకకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు అలజడి రేపుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని.. వాటిలో ఉత్తర కర్ణాటక కూడా ఒకటని మంత్రి ఉమేశ్ కత్తి అన్నారు. కర్ణాటకలో రెండు, ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించిన కొన్ని రోజులకే ఆ పార్టీ సీనియర్‌ నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Samayam Telugu కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి
50 States in India after 2024 elections, says Karnataka minister Katti Umesh


‘2024 లోక్‌ సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ప్రధాని మోదీ దీనిపై మదింపు చేస్తుండగా నాకు ఈ విషయం గురించి తెలిసింది. ఇందులో భాగంగా కర్ణాటక కూడా రెండు రాష్ట్రాలుగా విడిపోనుంది. అందువల్ల కొత్తగా ఉత్తర కర్ణాటక ఏర్పడేందుకు మనం పోరాడాలి’ అని మంత్రి కత్తి ఉమేశ్ అన్నారు. మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉమేశ్.. అక్కడ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు.

‘కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంశం మంచిదే. ఎందుకంటే ఏటికేడు జనాభా భారం పెరిగిపోతోంది. ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కర్ణాటక రాష్ట్రం విడిపోయినా ఎలాంటి ముప్పు లేదు. మనమంతా కన్నడిగులుగానే కలిసి ఉంటాం’ అని మంత్రి ఉమేశ్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల కిందట కర్ణాటక జనాభా 2 కోట్లు కాగా.. ప్రస్తుతం అది ఆరున్నర కోట్లకు చేరిందని ఉమేష్‌ కత్తి చెప్పుకొచ్చారు.

మంత్రి ఉమేశ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా.. కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటకను విడగొట్టేందుకు ప్రధాన మంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనే విషయం రాష్ట్ర మంత్రి ద్వారా బయటపడిందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. ‘ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ‘కర్ణాటక విభజన గురించి మాట్లాడటం ఆయనకు (ఉమేశ్ కత్తి) కొత్త కాదు. ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాలి’ అని సీఎం బొమ్మై అన్నారు.

‘ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం గురించి ఉమేశ్ కత్తి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి 100 సార్లకు పైగా ఆయన చెప్పి ఉంటారు. ఏదేమైనా కర్ణాటక అంతా ఒకటి. ఎంతో మంది కన్నడిగులు పోరాట ఫలితమే సమైక్య కర్ణాటక రాష్ట్రం’ అని రెవెన్యూ మంత్రి ఆర్ అశోకా అన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.