యాప్నగరం

Delhi: డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం.. దేశం మరో ఘనత, ప్రత్యేకతలివే

Delhi Metro Rail: భారత్‌లో మెట్రో రైలు వ్యవస్థ మరో ఘనత సాధించింది. దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభమైంది. ఢిల్లీ మెట్రో వ్యవస్థలో ప్రధాని మోదీ ఈ సరికొత్త రైలును ఆవిష్కరించారు.

Samayam Telugu 28 Dec 2020, 6:26 pm
దేశంలో మెట్రో రైలు వ్యవస్థ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభమైంది. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ మరోసారి అగ్ర రాజ్యాల సరసన నిలిచింది. ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థలో భాగంగా ఈ డ్రైవర్ లేని రైలును ప్రారంభించారు. పశ్చిమ జనక్‌పురి - బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కి.మీ. పొడవున్న మెజంటా లైన్‌లో డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (డిసెంబర్ 28) ప్రారంభించారు.
Samayam Telugu డ్రైవర్ లేని మెట్రో రైలు
druverless metro rail in Delhi


విర్చువల్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం కామన్ స్మార్ట్ కార్డును ఆవిష్కరించారు. స్మార్ట్ వ్యవస్థపై భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ రైలు ప్రారంభమే తెలియజేస్తోందని పేర్కొన్నారు. పట్టణీకరణను సులభతర జీవన విధానానికి ఒక అవకాశంగా పరిగణించాలని అన్నారు.


ఢిల్లీ వాసులకు డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలు నేటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ‘అధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించిన నవ శకానికి ఇది ఆరంభం’ అని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (DMRC) పేర్కొంది. మజ్లిస్‌ పార్క్‌ - శివ్‌ విహార్‌ మధ్య 57 కి.మీ. పొడవైన పింక్‌ లైన్‌ మార్గంలోనూ డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. 2021 జూన్ నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆ కొత్త లైన్ కూడా ఢిల్లీ మెట్రోలో మొత్తం 94 కిలోమీటర్ల మేర డ్రైవర్‌ రహిత రైలు సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. అప్పుడు ప్రపంచంలో డ్రైవర్‌ రహిత మెట్రో మార్గంలో 9 శాతం మార్గం కలిగి ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని డీఎంఆర్‌సీ తెలిపింది.


‘స్మార్ట్ విధానంపై ఇండియా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ రైలు ప్రారంభం తెలుపుతోంది. నేషనల్ కామన్‌ మొబిలిటీ కార్డ్ (NCMC) ద్వారా ఢిల్లీ మెట్రో అనుసంధానం అయింది. కొన్నేళ్ల కిందటి వరకు స్మార్ట్ వ్యవస్థపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పట్లో నిరాసక్త వాతావరణం ఉండేది. పట్టణీకరణ, సాంకేతిక అభివృద్ధి విషయంలో చాలా తేడా కనిపించేది. మా ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Also Read: వాహనదారులకు శుభవార్త.. మార్చి 31 వరకు ఊరట

Must Read: బాబోయ్ చలి, గడ్డకట్టిన సరస్సు.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.