యాప్నగరం

విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం.. త్వరగా కోలుకోవాలని కుమార్తె షర్మిష్ఠా భావోద్వేగ ట్వీట్

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీకి రెండు రోజుల కిందట ఆయనకు ఢిల్లీలో శస్త్రచికిత్స నిర్వహించారు. అయినా, ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నారు.

Samayam Telugu 12 Aug 2020, 1:54 pm
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతున్నట్టు ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని ఆయన కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ ప్రార్ధించారు. ఈ మేరకు ట్విటర్‌లో తండ్రి ఆరోగ్యంపై షర్మిష్ఠా ఆందోళన వ్యక్తం చేశారు.
Samayam Telugu ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠా
Pranab Mukherjee


‘గతేడాది ఆగష్టు 8న నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మా నాన్న దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు. కానీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఆగష్టు 10న ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సమయంలో దేవుడు ఆయనకు ఏది మంచో అదే చేస్తాడు.. జీవితంలో సంతోషం, దుఃఖాలు రెండింటినీ సమానంగా అంగీకరించడానికి నాకు బలాన్ని ఇవ్వాలి. మా తండ్రికి ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతున్న‌వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు’అని ట్వీట్ చేశారు.

ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డకట్టడంతో సోమవారం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీస్‌ రిసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ రిఫరల్‌ ‌‌‌హాస్పిటల్‌‌‌‌ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. బ్రెయిన్‌ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, పరిస్థితి మరింత క్షీణించిందని మంగళవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రణబ్‌ పూర్వీకుల గ్రామంలో ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ మంగళవారం మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు.

బ్రెయిన్ సర్జరీతోపాటు ప్రణబ్‌‌కు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. 2012 నుంచి 2017 వరకు ప్రణబ్‌‌‌‌ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.