ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్రంలో కేంద్రం విధించిన రాష్ట్రపతిపాలనను హైకోర్టు తోసిపుచ్చుతూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నెల 27వ తేదీ వరకు ఆ స్టే కొనసాగుతుందని శుక్రవారం సాయంత్రం చెప్పింది. ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్రపతిపాలనకు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు సిఫారసు చేసింది. దానిపై కాంగ్రెస్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు కేంద్రం తీరును తప్పుపట్టింది. రాష్ట్రపతిపాలనను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంలో ఈ అంశంపై విచారణ జరిగింది. దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ విచారణకు హాజరై కేంద్రం వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ నెల 27 తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతిపాలన కొనసాగించొచ్చన్న సుప్రీం
ఉత్తరాఖండ్లో కేంద్రం విధించిన రాష్ట్రపతిపాలనను హైకోర్టు తోసిపుచ్చుతూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది
TNN 22 Apr 2016, 6:51 pm