యాప్నగరం

ఉచితంగా ఫోన్ కాల్స్ అందించండి: టెలీకాం సంస్థల అధిపతులకు ప్రియాంక లేఖలు

Free Phone Calls | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ టెలీకాం సంస్థల అధిపతులకు లేఖలు రాశారు. వలస కూలీలకు నెల రోజులపాటు ఉచితంగా ఫోన్ కాల్స్ అందించాలని ఆమె కోరారు.

Samayam Telugu 29 Mar 2020, 8:09 pm
కరోనా మహమ్మారి దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ.. మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్‌ సదుపాయం కల్పించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ టెలీకాం కంపెనీల అధినేతలను కోరారు. ఈ మేరకు రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, వోడాఫోన్-ఐడియా చైర్మన్ కుమారం మంగళం బిర్లా, బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పుర్వార్, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు ఆమె వేర్వేరుగా లేఖలు రాశారు.
Samayam Telugu priyanka gandhi


‘‘లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆకలితో, దాహంతో, వ్యాధితో పోరాటం చేస్తున్నారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మన దేశ ప్రజలకు సాయం చేయడం మన కర్తవ్యం. ఇళ్లకు వెళ్తున్నవారిలో చాలా మంది దగ్గర డబ్బులు అయిపోతున్నాయి. రీచార్జ్ చేసుకోవడం కూడా వారికి సాధ్యపడటం లేదు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, వారి నుంచి కాల్స్ అందుకోవడం సాధ్యం కావడం లేదు.

కాబట్టి వచ్చే నెల రోజులపాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అందించాలని కోరుతున్నా. దీని వాళ్లు ఇబ్బందులు పడుతున్న వారు తమ కుటుంబీకులతో మాట్లాడుకోవడానికి సాయం చేసినట్లు అవుతుంది. వారి ముఖంలో ఉన్న భయాన్ని, అనిశ్చితిని తొలగించడానికి ఈ చర్య దోహదం చేస్తుంది’’ అని ప్రియాంక గాంధీ టెలీకాం సంస్థల అధిపతులను కోరారు.

Read Also: జర్మనీ మంత్రి ఆత్మహత్య.. కరోనా వేళ ప్రజలకు సాయం చేయలేనేమోనని..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.