యాప్నగరం

424 మందికి భద్రతను తొలగించిన పంజాబ్ ప్రభుత్వం

పంజాబ్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మరో 424 మంది ప్రముఖ వ్యక్తులకు సెక్యూరిటీని తొలగించింది. జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ 38వ వార్షికోత్సవానికి సంబంధించిన కార్యకలాపాల కారణంగా భద్రతను తొలగించినట్టు తెలుస్తుంది. కాగా గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 28 May 2022, 8:05 pm

ప్రధానాంశాలు:

  • సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం
  • సెక్యూరిటీని తొలగించినవారిలో రిటైర్డ్ పోలీసులు, మత పెద్దలు
  • గతంలో 184 మందికి భద్రత ఉపసంహరణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 424 మందికి భద్రతను తొలగించిన పంజాబ్ ప్రభుత్వం
పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. అవినీతి ఆరోపణలపై తన కేబినెట్‌లో మంత్రిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం భగవంత్ మాన్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను తొలగిస్తున్నట్టు సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
అలా భద్రతను ఉపసంహరించుకున్న వారిలో రిటైర్డ్ పోలీసు అధికారులు, మతపెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. భద్రతా సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ఉపసంహరిస్తున్నట్టుయ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ 38వ వార్షికోత్సవానికి సంబంధించిన కార్యకలాపాల కారణంగా భద్రతను తొలగించినట్టు పంజాబ్ పోలీసు భద్రతా విభాగంలోని సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో భద్రతా సంస్థలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్రం ఇప్పటికే 2,000 మంది పారామిలట్రీ సిబ్బందిని పంపించింది.

కాగా గత ఏప్రిల్‌లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేతో సహా 184 మందికి భద్రతను ఉపసంహరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారిలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, అతని కుటుంబ సభ్యులు, అమరిందర్‌ సింగ్ కుమారుడు, అతని భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్‌ సింగ్‌ బజ్వావర్‌ కూడా ఉన్నారు. కాగా ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను.. సీఎం భగవంత్ మాన్ సింగ్ పదవి నుంచి తొలగించారు. వస్తువుల కొనుగోలు టెండర్లలో కమీషన్ అడుగుతున్నారనే ఆరోపణలు విజయ్ సింగ్లాపై వచ్చాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, తాము ఒక శాతం అవినీతిని కూడా సహించబోమని సీఎం మాన్ అన్నారు. అనంతరం ఏసీబీ అధికారులు విజయ్ సింగ్లాను అరెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.