యాప్నగరం

Amritpal Singh: ఏడాది క్రితం వరకూ ఓ అనామకుడు.. ఇప్పుడు బింద్రన్‌వాలా 2.0

ఓ వ్యక్తి అరెస్టుతో పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా గురువారం రణరంగంగా మారింది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ విధ్వంసానికి దారితీసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు అనుచరుడు లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ను అరెస్టు ఇందుకు కారణం. దీంతో వందలాది మంది పోలీస్‌ స్టేషన్‌పైకి దూసుకొచ్చారు. చివరికి పోలీసులు వెనక్కి తగ్గి అతడ్ని విడుదల చేశారు. ఈ ఘటనతో మరోసారి పంజాబ్‌లో ఖలీస్థాన్ ఉద్యమం చాపకింద నీరులా సాగుతోందని రుజువయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉలిక్కి పడ్డాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 27 Feb 2023, 10:01 am

ప్రధానాంశాలు:

  • ఖలీస్థాన్ ఉద్యమాన్ని నడిపిన బింద్రన్‌వాలా
  • ఆపరేషన్ బ్లూ స్టార్‌తో హతమార్చిన సైన్యం
  • నటుడు దీప్ సిద్ధూ సంస్థ‌కు చీఫ్‌గా అమృత‌పాల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amritpal Singh
ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు, వార్సి పంజాబ్ దే చీఫ్ అమృత‌పాల్ సింగ్ (Amritpal Singh) మ‌ద్ద‌తుదారులు గురువారం అమృత్‌స‌ర్ (Amritsar)లో బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. క‌త్తులు, లాఠీలు, గ‌న్నుల‌తో అజ్‌నాలా పోలీసు స్టేష‌న్‌పై అతడి గ్యాంగ్ దాడికి పాల్పడింది. దీంతో అమృత్‌పాల్ సింగ్ స‌న్నిహితుడు ల‌వ్‌ప్రీత్ తూఫాన్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అమృత్‌పాల్ సింగ్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏడాది కిందటి వరకూ ఓ అనామకుడైన అతడ్ని.. ఒకప్పుడు ఖలీస్థాన్ ఉద్యమాన్ని (Khalistan) నడిపిన వేర్పాటువాది బింద్రన్‌వాలాతో పోల్చుతున్నారు.
ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటు కోరుతూ వేర్పాటువాద ఉద్యమానికి నాయకత్వం వహించిన జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా (Jarnail Bhindranwale).. 1984లో భారత్ సైన్యం చేపట్టిన ఆప‌రేష‌న్ బ్లూ స్టార్‌లో (Operation Blue Star) హతమయ్యాడు. ప్రస్తుతం అమృత‌పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కుల‌ను త‌న బోధ‌న‌ల‌తో రెచ్చ‌గొడుతున్నారు. అమృత్‌సర్ జిల్లా జల్‌పూర్ ఖేరాలో 1993లో జన్మించిన అమృత్‌‌పాల్ సింగ్... ఇంటర్ వరకే చదువుకున్నాడు. అనంతరం 2012లో తన బంధువు నడిపే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు.

ఫిబ్రవరి 2022 వరకూ అతడు ఎవరో తెలీదు.. ఓ అనామకుడు. గతేడాది రోడ్డు ప్రమాదంలో పంజాబీ గాయకుడు దీపు సిద్దూ (Deep Sidhu)మృతిచెందడంతో అతడు ఏర్పాటుచేసిన వార్సి పంజాబ్‌ దేకు (Waris Punjab De) తనను తాను చీఫ్‌గా అమృత‌పాల్ ప్రకటించుకుని వెలుగులోకి వచ్చాడు. దీపూ మ‌ర‌ణం త‌ర్వాత అతడి మద్దతుదారులకు మార్గదర్శనం చేసే నాయకుడిగా ఎదిగాడు. ప్ర‌భుత్వ‌మే దీపును చంపిన‌ట్లు అమృత్ ఆరోపిస్తున్నారు. ఏడాదిలోనే అతడి పాపులారిటీ విపరీతంగా పెరిగింది.

జర్నైల్ బింద్ర‌న్‌వాలా త‌ర‌హాలో డ్రెస్ కోడ్.. ట‌ర్బ‌న్ కూడా క‌ట్టుకుని, సాంప్ర‌దాయ సిక్కు గుర్తుల్ని తన వెంట అట్టిపెట్టుకుంటాడు. త‌న వ‌ద్ద ఉన్న భారీ ఆయుధ ద‌ళం ఫౌజువాన్‌తో ఇటీవ‌ల స్వర్ణ దేవాలయానికి వెళ్లాడు. సామాజిక రుగ్మ‌త‌లు, డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తామ‌ని చెప్పి బింద్ర‌న్‌వాలా స్ట‌యిల్‌లోనే జ‌నాల్ని ఆక‌ర్షిస్తున్నాడు. ప్రత్యేక సిక్కు దేశం కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. బింద్ర‌న్‌వాలా అడుగుజాడ‌ల్లోనే అమృత్‌పాల్ న‌డుస్తున్నాడు.

ఖలీస్థాన్ ఉద్య‌మాన్ని అణిచివేస్తామ‌ని హెచ్చరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అమృత్ బెదిరించారు. ఇందిరా గాంధీ త‌ర‌హాలోనే మిమ్మిల్ని కూడా చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. యువతలో భారీ ఎత్తున ఖలిస్థానీ భావజాలం నింపి తన సంస్థను వేగంగా విస్తరించాడు. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.

కాగా, అమృత్‌పాల్‌ కారణంగా మతానికి చెడ్డపేరు వస్తోందని.. పాక్‌ ఐఎస్‌ఐ అజెండాను పక్కగా అమలు చేస్తున్నాడని పలువురు సిక్కు మేధావులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో సిక్కు గురువులు, నాయకులు అమృత్‌పాల్‌ చర్యలను విమర్శించారు. చాలా మత సంస్థలు అతడి కార్యకలాపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.