యాప్నగరం

రఘురాం రాజన్.. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను రాజ్యసభకు పంపాలని భావిస్తోందట

TNN 8 Nov 2017, 3:03 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను రాజ్యసభకు పంపాలని భావిస్తోందట ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రతిపాదన తెచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికలతో రాజన్ ను ఎంపీగా ఎన్నిక చేయాలని కేజ్రీవాల్ అనుకుంటున్నారట. ఢిల్లీ నుంచి వినిపిస్తున్న ఈ ఖబర్ ఆసక్తిదాయకంగా ఉంది.
Samayam Telugu raghuram rajan in aap shortlist for rajya sabha membership
రఘురాం రాజన్.. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు?


ఆమ్ ఆద్మీ పార్టీ కోటాలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతాయని సమాచారం. అందులో ఒక దాన్ని రాజన్ కు కేటాయించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారట. రాజ్యసభకు సాదాసీదా రాజకీయ నేతలను పంపడానికి బదులు.. రాజన్ లాంటి ఆర్థిక వేత్తను పంపడం మేలనేది కేజ్రీవాల్ ఆలోచనగా తెలుస్తోంది. రాజన్ యూపీఏ హయాంలో ఆర్బీఐ గవర్నర్ గా నియమితులు అయ్యారు. ఎన్డీయే ఆయనను కొనసాగించలేదు.

రాజన్ పట్ల భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రమైన విముఖత వ్యక్తం చేస్తూ రావడంతో.. తనకే రెండో సారి కొనసాగే ఆసక్తి లేదని రాజన్ స్పష్టం చేశారు. రాజన్ స్థానంలో ఊర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా చేసింది మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్థిక వేత్తల్లో రఘురాం రాజన్ కూడా ఒకరు.

నోట్ల రద్దును ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలా భావస్వామ్యం ఉండటం, రాజన్ ఆర్థిక వేత్తగా నోబెల్ బరిలో నిలిచిన మేధావి కావడంతో.. ఆయనను రాజ్యసభ పంపడం తమకూ గౌరవ ప్రదం అవుతుందని ఆప్ భావిస్తోంది. మరి ఆర్బీఐ గవర్నర్ స్థానం నుంచి వైదొలిగిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లి అధ్యాపకుడిగా మారిన రాజన్ భారత రాజ్యసభకు ఎంపీగా వెళ్లేందుకు సమ్మతంతోనే ఉన్నారా? అనే అంశంపై స్పష్టత లేదింకా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.