యాప్నగరం

ఫైళ్లతో పాటు కరోనా మోసుకొచ్చిన ఉద్యోగి.. రైల్ భవన్ రెండోసారి మూసివేత

Delhi: రైల్ భవన్‌లో కరోనా అలజడి రేపింది. ఫైళ్లను తీసుకెళ్లే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు మోసుకొచ్చిన ఓ ఫైల్ రైల్వే శాఖ కార్యాలయంలోని రైల్వే బోర్డు ఛైర్మన్ వద్దకు కూడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Samayam Telugu 25 May 2020, 8:44 pm
రైలో భవన్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. సెంట్రల్‌ ఢిల్లీలోని రైల్వే కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులకు కరోనా సోకగా.. తాజాగా మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రైల్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ నాలుగో తరగతి మల్టీటాస్కింగ్ ఉద్యోగికి సోమవారం (మే 25) కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైల్ భవన్‌ను మూసివేసి శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. గతంలో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మే 14, 15 తేదీల్లో రైల్‌ భవన్‌ను ఇప్పటికే ఒకసారి మూసివేశారు.
Samayam Telugu రైల్ భవన్
Rail Bhavan


కార్యాలయంలో ఫైళ్లను వివిధ అధికారుల వద్దకు మోసుకెళ్లే ఆ ఉద్యోగి చివరిసారిగా మే 20న విధులకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. రైల్ భవన్‌లోని వివిధ కార్యాలయాలకు కూడా అతడు ఫైళ్లను తీసుకెళ్లినట్లు తేలడం కలవరానికి గురిచేస్తోంది. దీంతో రైల్ భవన్‌ను రెండు రోజుల పాటు మూసివేసి శానిటైజేషన్ చర్యలు చేపట్టడానికి నిర్ణయించారు.

ఆ ఉద్యోగి మోసుకొచ్చిన ఓ ఫైల్ రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని రైల్వే బోర్డు ఛైర్మన్ వద్దకు కూడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. తాజాగా కరోనా సోకిన ఉద్యోగి కాంటాక్ట్ అయిన వారందరి వివరాలు సేకరించి క్వారంటైన్‌కు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రైల్ భవన్‌లో ఇది ఐదో కరోనా కేసు కావడం గమనార్హం. ఇక్కడ పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. 24 గంటలు గడవక ముందే రైల్ భవన్‌లో మరో కరోనా కేసు నమోదైంది. మే 20న ఆమె చివరిసారిగా విధులకు హాజరైనట్టు సమాచారం. ఆమెతో కలిసి కార్యాలయ విధుల్లో పనిచేసిన 14 మంది అధికారులను క్వారంటైన్‌కు పంపించారు.

Also Read: భారత్‌లో కరోనా వ్యాక్సిన్.. కేంద్ర మంత్రి గుడ్ న్యూస్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.