యాప్నగరం

ఘోరం: గోవులను తరలిస్తున్నాడని కొట్టి చంపేశారు

ఓ వైపు గోసంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తిగత దాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని మూడు రోజుల కిందట సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరవకముందే రాజస్థాన్‌లో మరో ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 21 Jul 2018, 12:44 pm
ఓ వైపు గోసంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తిగత దాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని మూడు రోజుల కిందట సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరవకముందే రాజస్థాన్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. గోసంరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలకు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ దాడులపై సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. అల్వార్ జిల్లా రామ్‌ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన అక్బర్ ఖాన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి తన స్వగ్రామం కోల్గావ్ నుంచి రెండు ఆవులను తీసుకుని, రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆవులను తీసుకుని వెళ్తుండగా, అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో స్థానికులు వారిపై దాడి చేశారు.
Samayam Telugu గో సంరక్షణ దాడులు


ఈ దాడిలో బాధితుడు అక్బర్‌ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్చించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు అక్బర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుల కోసం గాలిస్తోన్న పోలీసులు, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. అల్వార్ జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. కొద్ది నెలల కిందట హరియాణాకు చెందిన పెహ్లా ఖాన్ అనే రైతు కూడా ఇలాంటి దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. ఇలాంటి ఘటనలు సరికాదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.