యాప్నగరం

క్యాబ్‌‌కు వ్యతిరేకంగా అసోంలో మిన్నంటిన నిరసనలు.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి

పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఈశాన్య రాష్ట్రం అసోం భగ్గుమంది. పౌరసత్వ ప్రకంపనలతో ఆ రాష్ట్రం గురువారం అట్టుడికింది. లక్షలమంది ఆగ్రహ జ్వాలలతో రణరంగాన్ని తలపించింది.

Samayam Telugu 13 Dec 2019, 8:40 am
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. మరోవైపు, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో జనం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసోం, త్రిపురలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా అసోంలో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలతో అసోం రణరంగాన్ని తలపిస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనకారులు బస్సులకు నిప్పంటించారు. రైళ్లను అడ్డుకోగా, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. పరిస్థితులు విషమించడంతో గువహటిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu assam


గువహటిలో నిరవధిక కర్ఫ్యూ అమల్లో ఉన్నా జనం లెక్కచేయకుండా వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వాహనాలకు నిప్పంటించి, భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగారు. లాలుంగ్‌ గావ్‌లో పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వడంతో వారిని అదుపు చేయడానికి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మరో 11 మంది గాయపడ్డారు. అటు, తేజ్‌పూర్‌, ధేకియాజులి పట్ణణాల్లోనూ నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గువహటి, దిబ్రూగఢ్‌, జోర్హాట్‌, తిన్‌సుకియాల్లో సైన్యం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించింది. అంతేకాదు, 10 జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీ ఇళ్లపైకి జనం రాళ్లు రువ్వారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, అసోం గణ పరిషత్(ఏజీపీ) నేతల ఇళ్లపై నిరసనకారులు దాడులకు దిగారు. గువహటిలో ఏజీపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై కూడా దాడులు చేశారు.

నిరసనల నేపథ్యంలో అసోం ప్రభుత్వం గువహటి పోలీసు కమిషనర్‌ దీపక్‌ కుమార్‌, అదనపు డీజీపీ ముకేశ్‌ అగర్వాల్‌‌ను తప్పించింది. వీరితో పాటు మరికొందరు అధికారులను బదిలీ చేసింది. ఉద్రిక్తతల కారణంగా అసోంలో విమానాల రాకపోకలను ఇండిగో, విస్తారా, ఎయిర్‌ ఇండియా, స్పేస్‌జెట్‌ సంస్థలు రద్దు చేశాయి. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. అసోం, త్రిపురలో ప్రయాణికుల రైలుసేవలు రద్దయ్యాయి. దిబ్రూగఢ్‌లోని చబువా, తిన్‌సుకియా జిల్లాలోని పానిటోలా రైల్వేస్టేషన్లకు నిప్పుపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.