యాప్నగరం

నేడు రామమందిర్ ట్రస్ట్ తొలి సమావేశం.. అయోధ్యకు భారీగా నిధుల కేటాయింపు

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కేంద్రం ఓ స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. మొత్తం 15 మంది సభ్యులతో ఏర్పడిన ఈ ట్రస్ట్ తొలిసారిగా నేడు సమావేశం కానుంది.

Samayam Telugu 19 Feb 2020, 10:11 am
Samayam Telugu ram-mandir2
అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కేంద్రం ట్రస్ట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సీనియర్ న్యాయవాది కే పరాశరన్ అధ్యక్షతన ఏర్పాటైన రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర తొలి సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశంలోనే ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రామజన్మభూమి న్యాస్ చీఫ్ మహంతి నృత్య గోపాల్ దాస్‌ను ఆహ్వానించారు. రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారికి ట్రస్ట్‌‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని అయోధ్య సాధువులు అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ మహంత్ దాస్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గోపాల్ దాస్‌ను ట్రస్ట్‌లో సభ్యుడిగా చేర్చాలని ప్రతిపాదించనున్నట్టు అందులోని సభ్యులు తెలిపారు.

అయోధ్య కేసులో హిందూ సంఘాల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ పరాశరన్‌ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా ఆయన నివాసంలోనే సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే రామమందిర నిర్మాణ పనులు ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే శ్రీరామనవమి లేదా అక్షయ తృతీయ నాడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన స్వామీ గోవింద్ దేవ్‌గిరి మహరాజ్ తెలిపారు. అయితే, ట్రస్ట్‌లోని ఇతర సభ్యుల అభిప్రాయాలతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో అయోధ్య అభివృద్ధికి భారీగానే నిధులను కేటాయించింది. బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా మంగళవారం శాసనసభ ముందుంచారు. అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ మరిన్ని వసతులను కల్పించడంతో పాటు సుందరీకరణకు రూ.85కోట్లు వెచ్చిస్తామని, అలాగే వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయ విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.