యాప్నగరం

కేంద్ర మంత్రి చెంప చెళ్లుమనిపించిన యువకుడు!

క్రికెట్‌ టీమ్‌లో రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని, రాజ్యాంగంలోని రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలంటూ గతంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది.

Samayam Telugu 9 Dec 2018, 12:32 pm
తరుచూ నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉండే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈసారి నోరుజారడం వల్ల కాదు తనకు ఎదురైన చేదు అనుభవంతో వార్తల్లోకి ఎక్కారు. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అథవాలే తిరిగి వెళ్తుండగా అనూహ్య ఘటన జరిగింది. మంత్రి అథవాలే వేదిక దిగి వెళ్లి తన వాహనం దగ్గరకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఆయనవైపు దూసుకొచ్చి మంత్రిగారి చెంప చెళ్లుమనిపించాడు. హఠత్పరిణామానికి కేంద్ర మంత్రి, ఆయన అనుచరులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకున్న ఆయన అనుచరులు ఆవ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా పోలీసులు గుర్తించారు. మంత్రి అనుచరుల చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu ramdas


మంత్రిపై ప్రవీణ్ ఎందుకు దాడిచేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆయన అభిమానులు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగిందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అథవాలేపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. గతంలో భీమాకొరెగావ్‌ ఘర్షణలపై కేంద్ర మంత్రి రామదాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దళిత హక్కుల కార్యకర్తలపై మావోయిస్టు ముద్రవేసి అరెస్టుచేయడం సరికాదంటూ ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అథవాలే వ్యాఖ్యలు చేశారు. అలాగే క్రికెట్‌లో రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని డిమాండ్ చేయడం, రాజ్యాంగంలోని రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.