యాప్నగరం

Rare fish in Bhadrak: చేపకు ఇంత డిమాండా.. రూ.3 లక్షలు ఇచ్చి మరీ కొన్నారు..!

ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. ఆయన వేసిన వలలో 32 కిలోల అరుదైన చేప (Rare fish in Bhadrak) చిక్కింది. దానికి వేలం నిర్వహించగా ఓ మందుల కంపెనీ సొంతం చేసుకుంది. అక్షరాల 3 లక్షల 10 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆ చేపలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. పోషకాలు కూడా ఉన్నాయి. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్‌ దేశాల వారు దిగుమతి చేసుకుంటుంటారు. దాంతో ఈ చేపకు ఇంత డిమాండ్ ఏర్పడింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 24 Jul 2022, 7:20 pm

ప్రధానాంశాలు:

  • ఒడిశాలో భద్రక్ జిల్లాలో చిక్కిన అరుదైన చేప
  • వలలో పడిన 32 కిలోల క్రోకర్ చేప
  • రూ. 3 లక్షల 10 వేలకు దక్కించుకున్న కంపెనీ
  • చేపలో ఎన్నో ఔషద గుణాలు, పోషకాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu క్రోకర్ చేప
Rare fish in Bhadrak: పుస్తెలమ్మైనా సరే పులస తినాలి. అనే నానుడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంతగా పులస చేప ఫేమస్. అలాగే ఒక సీజన్‌లో వేలాది రూపాయలు పెట్టి మరీ దానిని సొంతం చేసుకుంటారు. దాని రుచి కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ చేప పులసను మించిపోయింది. దాని రేటు కూడా లక్షల్లో పలికింది. లక్షలాది రూపాయలు పోసి దానిని కొనుగోలు చేశారు. అది ఎక్కడో కాదు ఒడిశాలోని భద్రక్ జిల్లాలోనే జరిగింది.
ఆ చేపలో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..? కచ్చితంగా ఆ చేపలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఔషద గుణాలు, పోషకాలు కూడా ఉన్నాయి. ఆ చేపే క్రోకర్ చేప. ఒడిశాలో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్‌ ఉల్లా వేసిన వలలో 32 కిలోలు ఉన్న క్రోకర్ చేప పడింది. ఇంకేముందు ఆ భారీ జలపుష్పాన్ని చాంద్‌బాలి చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేశారు. ఆ వేలంలో ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ దానిని అక్షరాలు రూ.3 లక్షల 10 వేలకు దక్కించుకుంది.

క్రోకర్ చేపకు డిమాండ్..
అయితే ఈ క్రోకర్ చేప భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప అని కూడా అంటారు. తెలియా అని కూడా అంటుంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్‌ దేశాల వారు దిగుమతి చేసుకుంటుంటారు. సాధారణంగా దీని ఖరీదు ఎక్కువగానే ఉంటుంది.

చేప ప్రత్యేకతలు..
ఈ చేపలను వండుకుని తినే కంటే ఔషధ వినియోగానికే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చేప గుండెను సీ గోల్డ్‌గా కొనియాడతారు. దీనిని ఎయిర్‌ బ్లాడర్‌తో తయారు చేసిన ప్రత్యేక దారం మనిషి గుండె ఆపరేషన్‌లో కుట్లు వేసేందుకు వినియోగిస్తుంటారు. దాంతో దీనికి గిరాకీ బాగా ఉంది. క్రోకర్‌ మొప్పలతో తయారు చేసిన దారం సాధారణ పరిస్థితుల్లో శరీరంపై కుట్లు వేసేందుకు వినియోగిస్తారు. సుమారు మూడేళ్ల క్రితం జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లా పారాదీప్‌ తీరంలో క్రోకర్‌ చేప వలకు చిక్కింది. అప్పుడు దాని రేటు లక్షా పది వేల రూపాయలు పలికింది. ఈ చేపలతో సూప్ చేసుకునే తాగితే గర్భారణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతుంటాయి. అందుకే ఈ చేపకు ఇంత డిమాండ్ ఉంది.

Read Also:ట్రాఫిక్ పోలీస్‌కు రోడ్డుపై రూ.45 లక్షలు దొరికాయి... ఆయన చేసిన పనికి అందరూ ఫిదా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.