యాప్నగరం

రాష్ట్రపతి గారూ.. తెలుగు వాళ్లంటే మీకూ చిన్నచూపేనా?

ఓ పక్క ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం నడుస్తోన్న వేళ.. కేంద్రం మాట మార్చిందని తెలుగు వారు ఆగ్రహంతో ఉన్న తరుణాన రాష్ట్రపతి ట్వీట్‌లో తెలుగు లేకపోవడం భాషాభిమానుల్ని కలచివేసింది.

Samayam Telugu 21 Mar 2018, 7:05 pm
రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ పురస్కారాలు అందజేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌తోపాటు ఇళయ రాజా సహా పలువురు ప్రముఖులు పద్మ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నవారి ఫొటోలు, వివరాలను రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ఇతరులు పద్మ అవార్డులు అందుకుంటున్న సమయంలో ఇంగ్లిష్‌తోపాటు వారి మాతృభాషలో ట్వీట్లు పెట్టిన రాష్ట్రపతి భవన్.. కిదాంబి శ్రీకాంత్ పద్మ శ్రీ అందుకున్న ఫొటోను మాత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ట్వీట్ చేసింది.
Samayam Telugu rp bhavan


మాములు రోజుల్లో ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోన్న వేళ.. ఏపీ అసలు భారతదేశంలోనే ఉందా..? అంటూ ఘాటుగా విమర్శలు వినిపిస్తోన్న తరుణాన రాష్ట్రపతి భవన్ ట్వీట్‌ తెలుగులో లేకపోవడం కలచివేసింది. అందులోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది పద్మ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి కావడంతో తెలుగు భాషాభిమనుల బాధ రెట్టింపయ్యింది.

ఇటీవలే ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్ గుర్తొస్తాయంటూ మన బ్యాడ్మింటన్ క్రీడాకారులపై ప్రశంసలు గుప్పించారు. అలాంటిది ఆయన కిదాంబిని మర్చిపోతారనుకోలేం. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, ఉర్దూ, తమిళం, మలయాళం తదితర భాషల్లో రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అవార్డులు అందుకున్న వారి వివరాలను ట్వీట్ చేశారు. కానీ తెలుగును మాత్రం ఎందుకు వదిలేశారు..? ఇది పొరబాటని సరిపెట్టుకోవాలా? లేదా మన గ్రహపాటు అని బాధపడాలా? ఆ కోవిందుడే బదులివ్వాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.