యాప్నగరం

జవాన్ రాకేశ్వర్ సింగ్‌పై మావోయిస్టుల కీలక ప్రకటన

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తమ చెరలో బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

Samayam Telugu 7 Apr 2021, 9:12 am
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్ట్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు తమపైకి దాడికి వచ్చారని తెలిపింది. మావోయిస్టులను నిర్మూలించే దుష్ట పన్నాగంతో 2000 మంది పోలీసులు తమపైకి దాడికి వచ్చారని, తమ యోధులు వీరోచితంగా పోరాడారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్‌‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్‌లు మృతి చెందినట్లు వెల్లడించింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మంగళవారం (ఏప్రిల్ 6) రెండు పేజీల లేఖ విడుదల చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Representational Image


తమ వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్ కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్‌పై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. రాకేశ్ సింగ్‌ను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని వెల్లడించారు. అప్పటివరకు రాకేశ్వర్ సింగ్ తమ వద్దే క్షేమంగా ఉంటాడని పేర్కొన్నారు. మా నాన్నను వదిలేయండి అంటూ ఓ రాకేశ్వర్ సింగ్ కూతురు మావోయిస్టులను కన్నీటితో అడుగుతున్న వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

పోలీసులు మా శత్రువులు కాదు..
పోలీసులు తమకు శత్రువులు కాదని మావోయిస్టులు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు లేఖలో ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 23 మంది పోలీసులు మరణించారని, మరో పోలీస్ తమ వద్ద బందీగా ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని.. వారంతా పారిపోయారని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. దాడికి ముందే పోలీసులు జీరగూడెం గ్రామస్థుడు మాడవి సుక్కాలును పట్టుకొని కాల్చి చంపి, ఎప్పటిలాగే కాల్పుల్లో చనిపోయాడని బూటకపు ప్రచారం చేశారని ఆరోపించారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్ అనంతరం 14 ఆయుధాలు, 2 వేల తూటాలు, కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మావోలు ప్రకటించారు.

మావోయిస్టులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు


మోదీ సర్కార్ 2020 నుంచి మావోయిస్టుల నిర్మూలనకు ప్రయత్నిస్తోందని లేఖలో మండిపడ్డారు. హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో భారీ దాడులకు పథక రచన జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. చర్చలకు మావోయిస్టులు సిద్ధంగానే ఉన్నారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు..

‘పీఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారు. పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలిపశువులు కావొద్దు. ప్రజలను, వనరులను, ప్రజా సంపదను కాపాడేందుకే ప్రతిదాడి చేయాల్సి వస్తోంది’ అని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.

Also Read:

ఏసీబీ భయం.. నోట్ల కట్టలను కాల్చేసిన ఎమ్మార్వో

మయన్మార్‌లో అరాచకం.. ప్రజలను పిట్టల్లా కాల్చేస్తున్న సైన్యం

కుమారుడి పెళ్లిలో తల్లికి షాక్.. తాను పోగుట్టుకున్న బిడ్డే వధువు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.