యాప్నగరం

ఆ ధీర బిడ్డలకు గౌరవంగా దీపం వెలిగించండి: మోదీ

Mann Ki Baat: దేశాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు గౌరవ సూచకంగా దీపాన్ని వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ కీలక అంశాలను ప్రస్తావించారు.

Samayam Telugu 25 Oct 2020, 4:35 pm
సైనికులు ఎన్నో పండుగలకు దూరంగా ఉంటూ.. దేశానికి సేవ చేస్తున్నారని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి సేవలకు గుర్తింపుగా ఈ పర్వదినాన ఓ దీపం వెలిగించాలని పిలుపు నిచ్చారు. ప్రతి నెల చివరి ఆదివారం రేడియా ద్వారా నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 25న ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యవంతమైన సైనికులు, భద్రతా దళాలతో భారతదేశం దృఢంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Samayam Telugu ప్రధాని మోదీ
mann ki baat


‘సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ, శత్రువుల బారి నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్ల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో ఒకసారి గుర్తుచేసుకోవాలి. దీపావళి, ఈద్‌ లాంటి పండుగల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ.. వారు దేశ సరిహద్దులను, మనల్ని సురక్షితంగా కాపాడుతున్నారు. ధైర్యవంతులైన, భరతమాత కుమారులు, కుమార్తెల గౌరవార్థం మనం ఇంట్లో దీపం వెలిగించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.


కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ పండుగలు నిర్వహించుకునేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనా వైరస్‌పై జరుగుతోన్న పోరులో తప్పకుండా విజయం సాధిస్తామనే దీమా వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని పేర్కొన్నారు.

పండుగల సమయంలో స్వదేశీ వస్తువులను కొనడానికే మొగ్గు చూపాలని.. ముఖ్యంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని (Vocal for Local) ప్రధాని మోదీ కోరారు. ఈ విషయంలో కశ్మీర్‌‌లోని పుల్వామా ప్రాంతం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. దేశానికి అవసరమయ్యే పెన్సిల్‌ కలపలో 90 శాతం పుల్వామా నుంచే ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు.

భక్తి ఉద్యమం భారత్‌లోనే అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారి యావత్‌ దేశ ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశాన్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘త్రిపుర నుంచి గుజరాత్‌ వరకు, జమ్మూకశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకు ప్రజల విశ్వాసాలకు ప్రతీకలుగా ఉన్న పుణ్యక్షేత్రాలు యావత్‌ దేశాన్ని ఒక్కతాటిపై నడిపిస్తున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు.

Also Read: వర్క్ ఫ్రమ్ హోం భరించలేక ఉరేసుకున్న టెకీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.