యాప్నగరం

Sabarimala: శబరిమలలో అపచారం.. పొన్నాంబళమేడుపై అక్రమంగా పూజలు

Sabarimala కేరళలోని శబరిమల ఆలయానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. నవంబరు నుంచి జనవరి వరకూ మండల, మకరవిలక్కు పూజలు సమయంలో రెండు నెలలకుపైగా ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. తర్వాత మాస పూజల కోసం నెలకు ఐదు రోజులు మాత్రమే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో . శబరిమల ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు కొండపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా పూజలు చేయడం గమనార్హం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 17 May 2023, 10:23 am

ప్రధానాంశాలు:

  • పొన్నాంబళమేడుపై వెలుగుతోన్న మకరజ్యోతి
  • తమిళనాడుకు చెందిన వ్యక్తి అక్రమంగా పూజలు
  • వీడియో వైరల్ కావడంతో కేరళలో తీవ్ర దుమారం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu శబరిమల ఆలయం
శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తి అక్రమంగా పూజలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై కేరళలో దుమారం రేగుతుండగా.. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శబరిమల ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు కొండపై తమిళనాడుకు చెందిన నారాయణ స్వామి, మరో నలుగురితో కలసి పూజలు చేసినట్లు వీడియోలో గుర్తించారు. ఏటా మకరువిలక్క సమయంలో పొన్నాంబళమేడు పర్వతం పైనే మకరజ్యోతిని వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు ఈ పర్వతం పరమ పవిత్రమైనది.
దట్టమైన అడవుల్లో ఉన్న ఈ పర్వతం అటవీ శాఖ పరిరక్షణలో ఉంటుంది. అటువంటి ప్రాంతానికి నిందితులు ఎలా ప్రవేశించగలిగారనే సందేహాలు ఉత్పన్నతమవుతున్నాయి. దీంతో అటవీ శాఖ, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మధ్య వివాదానికి కారణమయ్యింది. తంత్రి లేదా ప్రధాన పూజారి తప్ప టీడీబీ లేదా ఇతరులను దీనిపై వెళ్లేందుకు అనుమతి లేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలోకి నిందితుడు ఎలా వెళ్లగలిగాడనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

మరోవైపు, దీనిపై పోలీసులకు, వన్యమృగ సంరక్షణ చీఫ్‌కి ఫిర్యాదు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంత గోపన్‌ తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని రాష్ట్ర అటవీ శాఖ తెలిపింది. అయితే, నిందితుడు నారాయణ స్వామి గతంలో శబరిమల ఆలయం తాత్కాలిక సహ-పూజారిగా పనిచేసినట్టు తెలుస్తోంది. అతడి ప్రవర్తన బాగులేకపోవడంతో తొలగించారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతాలోకి నలుగురు వ్యక్తులు వెళ్తుంటే అటవీ శాఖ సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. అయితే, తమ కంటబడకుండా వేరే మార్గంలో వెళ్లి ఉంటారన్న అటవీ శాఖ అధికారుల వాదనను ఖండిస్తున్నారు. అయ్యప్ప ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేసినట్లు అర్థమవుతోందని టీడీబీ చీఫ్ అన్నారు.

ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు అనుమానిస్తున్నామని, అయితే తేదీని అధికారికంగా ధ్రువీకరించలేదని ఆయన అన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.