యాప్నగరం

కాంగ్రెస్, జేడీఎస్‌ పొత్తుకు ఇంకో ఆటంకం!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ వాయిదా పడిన రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 28న ఓటింగ్ జరగనుంది.

Samayam Telugu 23 May 2018, 8:17 am
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ వాయిదా పడిన రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 28న ఓటింగ్ జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ నామినేషన్ వేసిన అభ్యర్థి మరణించడంతో జయనగర అసెంబ్లీ స్థానంలో, ఓటర్ కార్డుల కుంభకోణంతో ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. ఈ రెండు స్థానాలకూ ఈ నెల 28 పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Samayam Telugu congress-jds


కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ప్రతి సీటూ చాలా కీలకమే. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్లూ ఎవరికి దక్కుతాయి? అనేది ఆసక్తిదాయకమైన విషయం అవుతోంది. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు వీటిని చెరొకటిగా పంచుకునే అవకాశాలున్నాయి. జయననగర స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి, ఆర్ఆర్ నగర్ సీటును జేడీఎస్‌కు ఇచ్చే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఇక్కడ ఈ పార్టీల పొత్తుకు ఇంకో ఆటంకం ఉంది. ఈ సీట్లకు ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టం ముగిసింది. జయనగర్‌లో బీజేపీ తరఫున మాత్రమే కొత్త నామినేషన్‌కు అవకాశం ఇచ్చింది ఈసీ. వారి అభ్యర్థి మరణించడంతో మరో నామినేషన్‌ను కోరింది. ఇక మిగతా నామినేషన్ల ఉపసంహరణకు గానీ, వేరే పార్టీల నామినేషన్లకు కానీ ఈసీ సమ్మతించలేదు. ఆర్ఆర్ నగర్ విషయంలో కూడా అంతే. కొత్త నామినేషన్ల దాఖలు, పాత నామినేషన్ల ఉపసంహరణ రెండూ లేవు.

ఈ నేపథ్యంలో సాంకేతికంగా అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ రెండూ పోటీలో ఉంటాయి. ఎన్నికల ముందు పొత్తులేని ఈ పార్టీలు ఈ రెండు సీట్ల పోటీలో పోరాడాల్సి ఉంటుంది. అయితే రెండు పార్టీలూ ఒప్పందం కుదర్చుకుని ఒక్కో సీటులో ఒక్కో పార్టీ అభ్యర్థిని డమ్మీగా మార్చుకోవచ్చు. అదే చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకు చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.