యాప్నగరం

Karnataka: అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతున్న కర్ణాటక ప్రభుత్వ పథకం

Karnataka కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీ హామీల అమలుకు తొలి క్యాబినెట్‌లోనే నిర్ణయం తీసుకుంది. వీటిలో ముఖ్యమైంది గృహలక్ష్మీ పథకం. దీని ద్వారా ప్రతి నెల కుటుంబంలోని ప్రతి మహిళా పెద్దకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది మహిళలు ఈ పథకం ప్రయోజనం పొందనున్నారు. అయితే, ఈ సాయం పొందడానికి అర్హులు అత్తా? లేక కోడలా? అనేది తెలియాల్సి ఉంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 2 Jun 2023, 2:42 pm

ప్రధానాంశాలు:

  • ఐదు గ్యారంటీ హామీలతో కాంగ్రెస్‌కు అధికారం
  • గృహలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2 వేల సాయం
  • లబ్దిదారుల విషయమై కొనసాగుతున్న సందిగ్దత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Karnataka
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Election) ఇచ్చిన హామీ మేరకు గృహలక్ష్మీ పథకం (Gruha Lakshmi Scheme) కింద ప్రతి ఇంటిలోని మహిళా కుటుంబ పెద్దకు నెల నెల రూ.2,000 చొప్పున ఆర్ధిక సాయం అందజేసే పథకానికి సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే, ఈ పథకం చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెడుతోంది. ప్రభుత్వం అందజేసే రూ.2,000 ఎవరికి అందుతుందనేది పెద్ద సమస్యగా మారింది. మహిళా కుటుంబ పెద్దకు నెలవారీ ఆర్ధిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన అర్హత ప్రమాణాలు లేకపోవడం వల్ల కుటుంబాల్లో గందరగోళం మరింత పెరిగింది.
ఈ విషయమై మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ను ప్రశ్నించగా.. ఆర్ధిక సాయం ఎవరికి చెందుతుందనేది కుటుంబం తీసుకునే నిర్ణయం అని చెప్పారు. అయితే భారతీయ సంప్రదాయం మహిళా కుటుంబ పెద్దగా అత్తను పరిగణిస్తున్నందున ఆమె అర్హురాలని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ ఆమె అంగీకరిస్తే కోడలికి ఇవ్వొచ్చని హెబ్బాల్కర్ అన్నారు. పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్ఖిహోళి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి అభిప్రాయంతో ఏకీభవించారు.

కుటుంబ పెద్ద ఎవరు అనే విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే సాయాన్ని అత్త, కోడలు సమానంగా పంచుకోవాలని మహిళా హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఇలా చేస్తే కుటుంబంలో సమస్యలు ఉండవని మహిళా హక్కుల కార్యకర్త సి నాగరత్న అన్నారు. ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమని, అత్త, కోడలు ఇద్దరికీ ప్రభుత్వం సొమ్ము ఇవ్వాలని మరో కార్యకర్త తెలిపారు.

మరోవైపు, శిశు అభివృద్ధి శాఖ ఇంకా విధివిధానాలపై చర్చించనందున పథకం అమలులో నిబంధనలు, షరతుల గురించి మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుందని హెబ్బాల్కర్ అన్నారు. గురువారం నాటి కేబినెట్ సమావేశం తర్వాత కొంత స్పష్టత వస్తుందని ఆమె తెలిపారు.

ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘గ్యారెంటీ’ హామీలపై మేధోమథనం మొదలైంది. ఆ పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్‌ సర్కారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజే ఈ పథకాలను అమలు చేస్తామన్న సిద్ధరామయ్య సర్కారు.. ఆర్థిక వ్యవహారాల కారణంగా సాహసించలేకపోయింది. ఆపై తొలి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసినా అప్పటికి పూర్తిస్థాయి మంత్రివర్గం రూపుదిద్దుకోలేదు. ఓవైపు, విపక్షాల విమర్శలు, ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సర్కారు ఆ ప్రకటన చేసే ముందు లోతైన విశ్లేషణ చేస్తోంది. జూన్‌ నుంచే ఉచిత పథకాలు పట్టాలెక్కుతాయని రాష్ట్ర ప్రజలు ఆశించినా ఇంకా ముహూర్తం కలిసిరాలేదు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.