యాప్నగరం

కండక్టర్‌గా పనిచేసే మా నాన్నకు జీతం పెంచండి: సీఎంకి లేఖ రాసిన ఆరేళ్ల చిన్నారి!

Maharashtra CM ఉద్ధవ్ ఠాక్రేకు ఓ ఆరేళ్ల చిన్నారి లేఖ రాసింది. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసే మా నాన్నకు జీతం పెంచాలని, తక్కువ వేతనంతో ఆయన తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారని లేఖలో పేర్కొంది.

Samayam Telugu 15 Dec 2019, 1:16 pm
తన తండ్రికి జీతం పెంచాలంటూ ఆరేళ్ల చిన్నారి ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తనతో తండ్రి ఎక్కువ సమయం గడపలేకపోతున్నాడని పేర్కొంటూ ఆర్టీసీ కండక్టర్ కుమార్తె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయడం విశేషం. జల్నా ప్రాంతానికి చెందిన సచిన్ హరాలే మహారాష్ట్ర ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె శ్రియా హరాలే స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. అయితే వేతనం తక్కువగా ఉండటంతో డబ్బుల కోసం అదనంగా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో తన తండ్రి ఎక్కువ సమయం గడపలేకపోతున్నాడని బాధపడిన ఆ చిన్నారి ముఖ్యమంత్రికి శుక్రవారం లేఖ రాసింది.
Samayam Telugu Uddhav


‘సర్‌.. మా నాన్న నాతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో నేను సరిగ్గా చదవలేకపోతున్నా. మీరు జీతం పెంచితే నాతో ఎక్కువ సమయం గడపడానికి, స్కూల్‌కు తీసుకెళ్లడానికి ఆయన అవకాశం ఉంటుంది.. జీతం తక్కువ రావడం వల్లే అదనంగా పనిచేయాల్సి వస్తుందని మా నాన్న చెప్పారు.. మా నాన్నతో ఎక్కువ సమయం గడపాలి’ అని మరాఠీలో లేఖలో రాసింది. అనంతరం లేఖను పోస్ట్ చేయమని తండ్రికి ఇచ్చింది. దీనిపై సచిన్ మాట్లాడుతూ.. నా జీతం గురించి సీఎంకు మా అమ్మాయి లేఖ రాసి.. పోస్ట్‌ చేయమని నాకు ఇచ్చిందని అన్నారు. దీనిని తాను ఆర్డినరీ పోస్ట్‌ ద్వారా పంపానని, ముఖ్యమంత్రికి చేరిందో లేదో నాకు తెలియదని అన్నారు.

శ్రియా నిద్రలేవకముందే విధులకు వెళ్లే సచిన్, అర్ధరాత్రి ఇంటికి వస్తుంటాడు. ఈ సమయానికి కుమార్తె నిద్రపోవడంతో సమయం గడపలేకపోతున్నాడు. ఎందుకంత ఆలస్యంగా వస్తున్నారని ఆ చిన్నారి ప్రశ్నించడంతో తండ్రి చెప్పిన మాటలు ఆమె బుర్రలో బలంగా నాటుకుపోయాయి. దీంతో ఏకంగా సీఎంకు లేఖరాసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.