యాప్నగరం

కుంభకోణాలు బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త హత్య

పోలీస్ రిక్రూట్‌మెంట్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ, మరుగుదొడ్ల నిర్మాణ పథకంలో అవకతవకలను వెలికితీయడమే కాకుండా అనేక కుంభకోణాలను బయటపెట్టిన సమాచార హక్కుల (ఆర్టీఐ) కార్యకర్త రాజేంద్ర సింగ్‌ను పట్టపగలే దుండగులు కాల్చి చంపారు.

Samayam Telugu 19 Jun 2018, 9:02 pm
పోలీస్ రిక్రూట్‌మెంట్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ, మరుగుదొడ్ల నిర్మాణ పథకంలో అవకతవకలను వెలికితీయడమే కాకుండా అనేక కుంభకోణాలను బయటపెట్టిన సమాచార హక్కుల (ఆర్టీఐ) కార్యకర్త రాజేంద్ర సింగ్‌ను పట్టపగలే దుండగులు కాల్చి చంపారు. బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వెళ్తోన్న సింగ్‌ను మఠ్‌బన్వారి చౌక్ వద్ద దుండగులు కాల్చి చంపారు. ఘటనా స్థలం పిప్రాకోఠి పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉండటం గమనార్హం. తీవ్ర గాయాలపాలైన రాజేంద్ర సింగ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
Samayam Telugu gun2


రాజేంద్ర గతంలో ఇలాంటి మూడు దాడుల నుంచి సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈసారి మాత్రం ఆయన ప్రాణాలను హరించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని ఇప్పటికే సీనియర్ పోలీస్ అధికారులకు రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన ఫిర్యాదు ఇంకా పోలీసుల పరిశీలనలోనే ఉంది. ప్రాణ హాని ఉందని ఆయన చెప్పిన కొన్ని రోజులకే హత్యకు గురికావడం బాధాకరం.

గతంలో ఎల్ఐసీ ఆఫీసు పనితీరు, టీచర్లు, పోలీస్ నియామకాల్లో అవకతవకలను బయటపెట్టి రాజేంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇందిరా ఆవాస్ యోజన కింద టాయిలెట్లు, ఇళ్ల నిర్మాణల పేరిట ప్రభుత్వ నిధులు ఎలా దుర్వినియోగం చేశారో బయటి ప్రపంచానికి చూపించారు. ఈ కుంభకోణాలపై దర్యాప్తు జరిపి స్థానిక కోర్టులో కేసులు కూడా పెట్టారు. వాటిలో కొన్ని కేసులు ఇటీవల విచారణకు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టపగలు ఆయన దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది.

రాజేంద్ర హత్యపై ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దల్ (ఆర్జేడీ) స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విఫలమయ్యారని విమర్శించింది. రాజేంద్ర సింగ్ హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వారిని టార్గెట్ చేస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత అలోక్ మెహతా పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.