యాప్నగరం

Sabarimala: తెరచుకున్న ద్వారాలు.. మహిళలకు దర్శనం దక్కేనా!

శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. 22 వరకు తెరిచే ఉంటాయి. కానీ, మహిళలకు దర్శన భాగ్యం మాత్రం దక్కేట్లు కనిపించడం లేదు.

Samayam Telugu 17 Oct 2018, 7:03 pm
తీవ్ర ఉద్రిక్తల మధ్య శబరిమల ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. మాసపూజ నిమిత్తం బుధవారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో ఆలయంలోకి భక్తులు పోటెత్తారు. అయితే.. ఇంతవరకూ ఒక్క మహిళ కూడా సన్నిధానంలోకి చేరుకోలేకపోయారు. పోలీసులు పటిష్ట భద్రత కల్పించినా.. శబరిమల మార్గంలో పెద్ద ఎత్తున మొహరించిన ఆందోళనకారులు, అయ్యప్ప భక్తులు మహిళలను కదలనీయడంలేదు. లాఠీ దెబ్బలు తిన్నా వెరవడం లేదు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం ఆశగా వచ్చిన పలువురు మహిళలు తీవ్ర నిరాశతో తిరుగుముఖం పట్టారు.
Samayam Telugu Ayyappa


బుధవారం రాత్రి 10.30 వరకు దైవదర్శనం చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. అక్టోబరు 22 వరకు ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. అప్పటివరకైనా మహిళలకు దర్శనం దక్కుతుందా? వారి చిరకాల వాంఛ నెరవేరుతుందా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. క్షణక్షణానికి పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో మహిళలు ఆ సాహసం కూడా చేసే స్థితిలో లేరు.

ఆందోళనకారుల్లో పెద్ద ఎత్తున మహిళలు
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న వారిలో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం. ఆందోళనకారులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. కర్ణి సేన తదితర హిందూ ధార్మిక సంఘాలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను కూడా ఎదిరించి ఆందోళనకారులు అడుగడుగునా మహిళలను అడ్డుకుంటుడంతో ఆలయ మార్గాలన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పును తప్పకుండా అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలానుగుణంగా సంప్రదాయాలు మారాల్సి ఉందని సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన దుబాయ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. మహిళా భక్తులు ఆలయంలోకి ప్రవేశించలేకపోతున్నారు. రక్తపాతం జరిగినా మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు.

రంగంలోకి కమాండో బృందాలు..
బుధవారం సాయంత్రం అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకున్న తర్వాత మహిళలు ప్రవేశించకుండా ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. శబరిమలలో తాజా పరిస్థితులు, ఆందోళనను చిత్రీకరించేందుకు వచ్చిన పలువురు మీడియా ప్రతినిధులు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై ఆందోళనకారులు దాడికి దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు.

శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి కాకినాడ నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరిన మాధవి (45) అనే మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు భద్రత కల్పించినా ఆమె సన్నిధానంలోకి వెళ్లలేకపోయారు. పంబ, నీలక్కల్‌, వండిపెరియార్‌, ఎరుమేలి తదితర ప్రాంతాల్లో పోలీసు భద్రతా బలగాలు మోహరించాయి. వారిలో మహిళా సిబ్బంది కూడా భారీగా ఉన్నారు. కమాండో బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు.

నీలక్కల్‌ ప్రాంతంలో ఆందోళనకారులు పలు బస్సులను, మీడియా సంస్థల వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసుల టెంట్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘర్షణల్లో పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు.

తీర్పును కచ్చితంగా అమలు చేస్తాం..
శబరిమలకు వచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త రాహుల్‌ ఈశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలక్కల్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద ఆయణ్ని అరెస్టు చేసిన పోలీసులు పంబా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. తనను కుట్రపూరితంగానే అరెస్టు చేశారంటూ రాహుల్‌ ఆరోపించారు.

శబరిమల ఆలయం ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శబరిమల ఆలయ మార్గాల్లో నెలకొన్న పరిస్థితులపై కేరళ మంత్రి శైలజ స్పందించారు.

‘ఉద్దేశ పూర్వకంగానే ఇదంతా చేస్తున్నారు. ఆందోళనకారులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగబద్ధమైనవి. వాటిని ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుంది’ అని శైలజ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.