యాప్నగరం

‘తీర్పు ఏదైనా పురాతన ఆచారమే పాటిస్తాం’

దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ మహిళలందరికీ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Samayam Telugu 30 Sep 2018, 10:29 am
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని, 10 నుంచి 50 ఏళ్లలోపు వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై మహిళల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని స్వాగతిస్తే, మరి కొందరు మాత్రం గతంలో ఉన్న సంప్రదాయాన్ని గౌరవించాలని అంటున్నారు. తాజాగా భారత హిందూ మున్నాని సంస్థ మహిళా సభ్యులు సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో దీపాలు వెలిగించి నిరసన తెలియజేశారు. తమకు 50 ఏళ్లు వచ్చేదాకా శబరిమల ఆలయంలోకి వెళ్లబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చెన్నైలోని గంగాదీశ్వర ఆలయంలో దీపాలు వెలిగించి, నిరసన తెలిపిన ఆ సంస్థకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. కోర్టు తీర్పు ఏమైనప్పటికీ తాము మాత్రం పురాతనంగా వస్తున్న ఆచారాలనే పాటిస్తామని, ఇదే అందరికి మంచిదని తేల్చి చెప్పారు.
Samayam Telugu శబరిమల తీర్పు


హిందూ మక్కల్ కట్చి చీఫ్ అర్జున్ సంపత్ మాట్లాడుతూ.. కోయంబత్తూరు, కడలూరు, తిరుపూర్‌ వ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు చేపట్టామని, గతంలోని కట్టబాట్లపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. మహిళలకు ఆలయ ప్రవేశం అనేది మత విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ చేపట్టినట్టు వివరించిన అర్జున్, వీటిని శబరిమల ఆలయం బాధ్యతలు నిర్వహించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు అందజేయనున్నట్టు తెలిపారు.

వాస్తవానికి 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం. వారింకా పునరుత్పత్తి దశలోనే ఉంటారని, అలాంటి మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే మైల పడుతుందనే వారిని నిషేధించారు. అయితే, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దంగా ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, ఈ నిబంధనను కొట్టివేస్తూ అన్ని వయసుల మహిళలకు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. కానీ, ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి మాత్రం చీఫ్ జస్టిస్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారం మినహా ఇలాంటి మత విశ్వసాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని ఆమె వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.