యాప్నగరం

రెండు రోజుల్లో తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. ఏటూ తేల్చని సుప్రీం

అన్ని వయస్సుల మహిళలను అయ్యప్ప సన్నిధానంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో మొదలైన వివాదానికి ముగింపు పడుతుందని అందరూ భావించారు. అయితే, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Samayam Telugu 14 Nov 2019, 1:29 pm
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం తుది తీర్పును వెలువరించింది. అయితే, ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరపాలని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు... ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీచేసింది. అయితే, గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Samayam Telugu sabari2


దీంతో శబరిమల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చడానికి విస్తృత ధర్మాసనానికి బదిలీచేయాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే, శబరిమలలో మండల పూజలకు ఆలయం మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న వేళ స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో కేరళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.

గతేడాది సుప్రీం తీర్పు తర్వాత కేరళతో సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. సెప్టెంబరు 28న తీర్పు వెల్లడించిన తర్వాత తొలిసారి అక్టోబరులో నెలవారీ పూజల కోసం ఆలయం తెరుచుకోగా, 50 ఏళ్లలోపు మహిళలు శబరిమలలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడంతో ఘర్షణ వాతావరణం నెలకుంది. శబరిమలలో శతాబ్దాలుగా సాగుతోన్న సంప్రదాయానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా కాపాడుకుంటామని అయ్యప్ప ధర్మసేన ప్రకటించింది.

ఈ ఏడాది జనవరి 2న బిందు అమ్మిని(40), కనకదుర్గ(39) అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అయ్యప్ప భక్తులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన తర్వాత కేరళలోని వివిధ హిందూ సంస్థలతో కూడిన శబరిమల కర్మ సమితి మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అటు కేరళ ప్రభుత్వం.. ఇటు అయ్యప్ప భక్తులు వెనక్కు తగ్గకపోవడంతో కేరళ రణరంగాన్ని తలపించింది.

తాజాగా, ఆలయం తెరుచుకోనుండగా మళ్లీ ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందా? భక్తుల మనోభావాలను గౌరవిస్తుందా? అనే మీమాంస నెలకుంది. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీం తీర్పును అమలుచేస్తామని కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు ప్రకటించాయి. అయ్యప్ప సన్నిధానంలో 10 వేల మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. వీరిలో 300 మంది వరకు మహిళా పోలీసులు కూడా ఉండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.