యాప్నగరం

సహచరుల చేతిలోనే హత్యకు గురైన నక్సల్స్ అగ్రనేత

మావోయిస్టుల కోట చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నక్సల్ అగ్రనేత సొంత క్యాడర్ చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 3 Oct 2020, 12:47 pm
మావోయిస్ట్ అగ్రనేత సహచరుల చేతిలోనే హత్యకు గురయినట్టు చత్తీస్‌గఢ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. బిజపుర జిల్లాల్లో అనేక దాడుల్లో పాల్గొని పలువురి హత్యలతో సంబంధం ఉన్న ఈ అగ్రనేతపై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల గంగలూర్ ప్రాంతంలో అనేక మంది మరణాలకు కారణమయ్యాడని పేర్కొన్నారు. ‘బిజపుర జిల్లాలో నక్సల్స్‌కు సంబంధించిన ఓ పెద్ద సంఘటన వెలుగులోకి వచ్చింది.. మావోయిస్ట్ డివిజనల్ కమిటీ సభ్యుడు మెడియం విజ్జా గంగలూరు ఏరియా దళం సభ్యుల చేతిలోనే హత్యకు గురయ్యాడు’ అని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలియజేశారు.
Samayam Telugu మావోయిస్ట్ అగ్రనేత హతం
Representational Image


బిజపుర జిల్లా పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని అనేక మంది పౌరుల హత్యల వెనుక విజ్జా హస్తం ఉందని ఐజీ అన్నారు. అమాయకులైన గిరిజనుల పట్ల దారుణ హింసకు సంబంధించి సీనియర్ నేతలు, స్థానిక క్యాడర్‌లో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. దక్షిణ బస్తర్‌ ప్రాంతంలో ఇటీవల అనేక మంది అమాయక గిరిజనులను మావోయిస్టులు పొట్టనబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేతను సహచరులే చంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఐజీ తెలియజేశారు.

రెండు రోజుల కిందట ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. బీజాపూర్‌ జిల్లా జంగల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతులను గనిరాం కొర్స, గోపాల్‌ కుడియంగా పోలీసులు గుర్తించారు. ప్రజాకోర్టుల పేరిట మావోయిస్టులు మారణహోమం సృష్టిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నక్సల్స్ కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.