యాప్నగరం

అన్నా హజారే దీక్షా శిబిరంలో సీఎం ఫడణవీస్‌పైకి షూ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనపైకి ఓ దుండగుడు షూ విసిరాడు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్ష విరమణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 29 Mar 2018, 7:22 pm
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు దేశ రాజధాని ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనపైకి ఓ దుండగుడు షూ విసిరాడు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే గత 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం (మార్చి 29) సాయంత్రం ఫడణవీస్‌తో చర్చల అనంతరం ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

లోక్‌పాల్‌ చట్టం తీసుకురావాలని, రైతుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఈ నెల 23న దీక్షకు దిగారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గురువారం సాయంత్రం హజారే దీక్షా శిబిరానికి విచ్చేసి ఆయనతో చర్చలు జరిపారు. వారి మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో అన్నా హజారే తన దీక్ష విరమించారు. అన్నా హజారేకు ఫడణవీస్‌ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

దీక్ష విరమణ అనంతరం అదే ప్రాంగణంలో అన్నా హజారే, ఫడణవీస్ సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే.. ఫడణవీస్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆయనపైకి షూ విసిరారు. వేదికపైకి దూసుకొచ్చిన తెల్ల రంగు షూ ఫడణవీస్‌కు ఎడమ వైపున కాస్త దూరంలో పడిపోయింది. ఆ దృశ్యాన్ని వీడియోలో గమనించవచ్చు.

దీక్ష విరమించిన హజారే..


రైతులకు సంబంధించి స్పష్టమైన హామీ రాకపోవడంతో సదరు వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.