యాప్నగరం

మౌంట్ ఎవరెస్టు శిఖరంపై తెలుగు తేజాలు

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించారు.

Samayam Telugu 14 May 2017, 9:09 am
ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించారు. 8848 మీటర్ల ఎత్తైన ఈ మంచుకొండ పైకి శనివారం చేరుకున్నారు. ప్రస్తుత వసంత రుతువు పర్యటనకు సంబంధించి పర్వత శిఖరానికి చేరుకున్న తొలి అధిరోహకులు ఏపీ స్టూడెంట్స్ కావడం గమనార్హం.
Samayam Telugu six andhra pradeshs students scale mount everest
మౌంట్ ఎవరెస్టు శిఖరంపై తెలుగు తేజాలు


నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆర్థికసాయంతో పాటు శిక్షణ ఇప్పించింది. 2014లో అతి పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించి తెలంగాణ గిరిజన బాలిక మాలవత్ పూర్ణ, మరో విద్యార్థి ఆనంద్ లకు శిక్షణ ఇచ్చిన శేఖర్ బాబు..వీరికి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రాన్స్ సెండ్‌ అడ్వంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంలో విద్యార్థులు శిక్షణ పొందారు.


రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విభాగం ఆధ్వర్యంలో 13 మంది, యువజన సంక్షేమ విభాగం తరఫున ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేశారు. మొత్తం 19మంది ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు బయలు దేరగా.. తొలుత అందులో ఆరుగురు ఈ రికార్డును సాధించారు.

మిగతా వారు కూడా ఒకట్రెండు రోజుల్లో ఎవరెస్టు ఎక్కనున్నారు.

ఎవరెస్టు అధిరోహించిన ఆరుగురిలో...సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన వూయక కృష్ణారావు, కుంజా దుర్గారావు, జి.సురేష్‌బాబు, యువజన సంక్షేమ విభాగం తరఫున వెళ్లిన సత్యారావు కారె, సుందరాన నాగరాజు, తమ్మినేని భరత్‌ లు ఉన్నారు. ఇందులో నాగరాజు (19) అతి పిన్న వయస్కుడు.


ఎవరెస్ట్ ను ఎక్కేందుకు సాధారణంగా 45 రోజుల సమయం పడుతుందని, అయితే మన విద్యార్థులు కేవలం 30 రోజుల్లోనే అధిరోహించారని వీరికి శిక్షణ సమన్వయకర్తగా వ్యవహరించిన యు.రఘునాథ్‌రెడ్డి వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.