యాప్నగరం

Uttar Pradesh: ప్లీజ్ సార్.. వెళ్లొద్దు.. బదిలీపై వెళ్తున్న టీచర్‌ను వదలని విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బదిలీపై వెళ్తున్న టీచర్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన్ని చుట్టుముట్టి.. బోరున ఏడ్చారు. ఆ ఉపాధ్యాయుడు కూడా వారి అభిమానానికి కన్నీరు పెట్టుకున్నారు. కానీ బాగా చదువుకోమని, మళ్లీ వస్తానని చెప్పి ఆ టీచర్‌కు సర్దిచెప్పారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన యూజర్లు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 16 Jul 2022, 6:34 pm

ప్రధానాంశాలు:

  • రాయ్‌ఘడ్ గ్రామంలో టీచర్‌కు బదిలీ
  • టీచర్‌ను చుట్టుముట్టి ఏడ్చేసిన విద్యార్థులు
  • పిల్లలకు సర్ది చెప్పిన టీచర్ శివేంద్ర సింగ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu టీచర్‌ దగ్గర విద్యార్థులు
జీవితంలో గురువుల స్థానం ఎనలేనిది. పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. వారి వ్యక్తిత్వాలను నిర్మించడంలో టీచర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారు. పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండడానికే కాదు.. విలువలతో బతకడానికి కూడా ఉపాధ్యాయులే కారణం. అందుకే విద్యార్థులు కొందరి టీచర్లపై ప్రేమను, అభిమానాన్ని పెంచుకుంటారు. వారి చెప్పిందే వేదంగా నడుస్తారు. అలాంటీ టీచర్ దూరమైతే.. తట్టుకోలేరు. కన్నీరుమున్నీరవుతారు. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫర్ అయి వెళ్తున్న మాస్టార్‌ని వెళ్లొద్దంటూ విద్యార్థులు చుట్టుముట్టారు.
చందౌలి జిల్లాలో రాయ్‌ఘడ్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు శివేంద్ర సింగ్ అనే టీచర్ నాలుగేళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి పిల్లలకు మంచి మంచి టెక్నిక్కులతో పాఠాలు చెప్పేవారు. మంచి చెడుల గురించి తెలియజేసేవారు. ఆయన పాఠాలను విద్యార్థులు తెగ ఇష్టపడే వారు. అందుకే ప్రతి విద్యార్థి తప్పని సరిగా ఆయన క్లాస్‌కు వెళ్లేవారు. శివేంద్ర సింగ్ వల్ల స్కూల్లో హాజరు శాతం కూడా పెరిగింది. అయితే శివేంద్ర సింగ్‌ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. దాంతో ఆయన ఆ పాఠశాలను విడిచి వెళ్లక తప్పలేదు.


బదిలీపై మంగళవారం ఆయన పాఠశాల నుంచి వెళ్తున్న సమయంలో వీడ్కోలు చెప్పాల్సిన విద్యార్థులు అతనిని వదల్లేదు. చాలా మంది విద్యార్థులు అతనిని కౌగిలించుకుని ఏడ్చేశారు. కొంతమంది విద్యార్థులు అతనిని గట్టిగా పట్టుకుని.. ప్లీజ్ సార్ వెళ్లొద్దంటూ బతిమాలుకున్నారు. ఆ టైంలో విద్యార్థులను వారించడానికి శివేంద్ర సింగ్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయనకు కూడా కన్నీరు ఆగలేదు. అయినా సరే తాను మళ్లీ వస్తానని, అప్పటి వరకు కష్టపడి చదవి మంచి మార్కులు సాధించాలని పిల్లలకు చెప్పారు. ఈ సందర్భంగా శివేంద్ర సింగ్‌కు మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు బహుమతులు అందించారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం ఉద్వేగానికి గురవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.