యాప్నగరం

వలస కార్మికులను 15 రోజుల్లోగా స్వస్థలాలకు తరలించండి.. కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం హుకుం

కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, వ్యతలపై మీడియాలో వస్తున్న కథనాలను సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నేడు కీలక ఆదేశాలు జారీచేసింది.

Samayam Telugu 5 Jun 2020, 3:50 pm
లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు 15 రోజుల్లోగా తరలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసింది. జూన్ 3 వరకూ 4,200 శ్రామిక్ రైళ్లలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతకు ముందు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనానికి వివరించారు.
Samayam Telugu వలస కార్మికులు
Stranded Migrants


ఇప్పటి వరకూ కోటి మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించామని, పెద్ద సంఖ్యలో ఉత్తరప్రదేశ్, బీహార్‌కు రాష్ట్రాలకు శ్రామిక్ రైళ్లు నడిపామని తెలిపారు. ఎంత మంది వలస కూలీలను తరలించాలి, వారికి అవసరమైన రైళ్లు సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వాల వివరాల ఆధారంగా వాటిని నడిపినట్టు పేర్కొన్నారు. లాక్‌డౌన్ వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై మీడియాలో పలు కథనాలు రావడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది.

మే 28 నాటి విచారణ సందర్భంగా వలస కూలీలను వారి స్వస్థలాలకు రైళ్లు, బస్సుల ద్వారా తరలించాలని, వారికి ఆహారం అందజేసి, ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, లోపాలు ఉన్నాయని గతంలో వ్యాఖ్యానించింది. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు తక్షణమే ఆహారం, వసతి, రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

వలస కార్మికుల రాజ్యాంగ హక్కులను రక్షించాలంటూ పలువురు సీనియర్ న్యాయవాదులు సుప్రీంను కోరారు. వలస కార్మికుల ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయని, వేలాది మంది రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకున్నారు.. ఈ సంక్షోభం నుంచి వారిని బయటపడేయడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవడం దృష్టిసారించాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.