యాప్నగరం

Sena Vs Sena Case: గవర్నర్ తప్పిదమే కానీ, ఉద్ధవ్ రాజీనామా చేశారు: సుప్రీం కీలక వ్యాఖ్యలు

Sena Vs Sena Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, డిప్యూటీ స్పీకర్ నోటీసులను షిండే వర్గం కూడా సవాల్ చేసింది. ఈ క్రమంలో రెండు పిటిషన్లపై మార్చిలో తొమ్మిది రోజులపాటు ఇరుపక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐదుగురు జడ్జిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 11 May 2023, 1:23 pm

ప్రధానాంశాలు:

  • గతేడాది శివసేనలో షిండే తిరుగుబాటుతో సంక్షోభం
  • ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు తీర్పు
  • గవర్నర్ కోశ్వారీ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Supreme Court
గతేడాది శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. 2022 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్‌నాథ్ షిండేతో పాటు మరో 15 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను కూడా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. ఎందుకంటే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవడానికి బదులుగా రాజీనామాను ఎంచుకున్నారని పేర్కొంది.
అయితే, ఇదే సమయంలో నాటి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్వారీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. ఠాక్రే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కోల్పోయారని నిర్ధారించడంలో తప్పు చేశారని, షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు ఖండించింది. ఏక్‌నాథ్ షిండే గ్రూపు విప్‌ను నియమించి స్పీకర్ తప్పు చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ అధికారంపై 2016 నబమ్ రెబియా తీర్పుపై సమీక్షకు విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి బలపరీక్ష ఉపయోగపడదని పేర్కొంది.

కాగా, ఈ తీర్పు ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు సూచిస్తోందని, ఇది మాకు నైతిక విజయమని అన్నారు. కాగా, గతేడాది జూన్‌లో శివసేనలో చీలిక ఏర్పడి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ సర్కారు కూలిపోయింది. అనంతరం బీజేపీ మద్దతుతో షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ షిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ వర్గం ఈ ఏడాది ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.