యాప్నగరం

సామాజిక పోరాటకర్త, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ కన్నుమూత

New Delhi: స్వామి అగ్నివేశ్ 1939 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఈయన అసలు పేరు వేపా శ్యాంరావు. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి పట్టా పుచ్చుకున్నారు.

Samayam Telugu 11 Sep 2020, 8:47 pm
హరియాణా మాజీ ఎమ్మెల్యే, ఆర్య సమాజ్ లీడర్ స్వామి అగ్నివేశ్ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో కొద్ది రోజుల క్రితం దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. సామాజిక హక్కుల పోరాటకర్త కూడా అయిన స్వామి అగ్నివేశ్ కొన్ని ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో చేరారు. శరీరంలో కొన్ని అవయవాలు విఫలం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) చెందడంతో గత మంగళవారం నుంచి ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu స్వామి అగ్నివేశ్
Swami Agnivesh


స్వామి అగ్నివేశ్ 1939 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఈయన అసలు పేరు వేపా శ్యాంరావు. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి పట్టా పుచ్చుకున్నారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలతో నడిచేలా అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. అంతేకాక, ఆయన ఓ అడ్వకేట్ కూడా. మతపరమైన సమస్యలపై మాత్రమే కోర్టులో వాదించేవారు. ఎన్నో సామాజిక సమస్యలపై పోరాటం చేశారు. ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణ హత్యలు ఎక్కువగా చేయిస్తున్న రోజుల్లో అందుకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు.

ఆధ్యాత్మికం, మతపరమైన అంశాలపై స్వామి అగ్నివేశ్ పలు పుస్తకాలు కూడా రాశారు. రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావనా అవార్డు, రైట్ లైవ్లీహుడ్ అవార్డులు ఆయన్ను వరించాయి. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.