యాప్నగరం

జమ్మూ ఉగ్రదాడికి పాక్‌లోనే వ్యూహరచన!

సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ఉగ్రవాదులు శనివారం ఉదయం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సైనికుల నివాసం సమీపంలోని ఓ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ నుంచే కాల్పులు జరిపారు.

TNN 11 Feb 2018, 1:24 pm
సుంజువాన్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు హస్తం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. సైనిక స్థావరంపై దాడిలో హిజ్బుల్ ముజాయిద్దీన్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు సంయుక్తంగా పాల్గొన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ ఘటన వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాఉద్దీన్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ల ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున మొదలైన ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఈ రెండు గ్రూపులు కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సంయుక్త కేంద్రాన్నిఏర్పాటుచేసి, శిక్షణ ఇచ్చి పంపినట్లు గుర్తించారు. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి ముందు సలాఉద్దీన్, మసూద్ అజర్‌లు మాట్లాడుకున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.
Samayam Telugu syed salahuddin and masood azhar masterminded sunjwan army camp attack reports
జమ్మూ ఉగ్రదాడికి పాక్‌లోనే వ్యూహరచన!


పీఓకేలోని ముజఫరాబాద్‌లో రెండు గ్రూపులూ కలసి టెర్రరిస్టు క్యాంపును నిర్వహించి, శిక్షణ ఇచ్చి పంపారని వెల్లడించాయి. ఏకే-47 తుపాకులు, ఇతర ఆయుధాలు ఈ ఉగ్రవాదులు తీసుకొచ్చారని, ఆపరేషన్ తర్వాత ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. వారి వద్ద లభించిన వస్తువులను పరిశీలించిన తరువాత వారు జైషే మొహమ్మద్ కు చెందిన వారని ఖరారైందని తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ పీఆర్ అధికారి దేవేందర్ ఆనంద్ వెల్లడించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులంతా జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారే కావడం గమనార్హం.

ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్ సీఎం మొహబూబా ముఫ్తీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం దాడిలో గాయపడిన చికిత్స పొందుతున్న సైనికులను ఆమె పరామర్శించారు. లోనికి ప్రవేశించిన ముష్కరులను గుర్తించడానికి హెలికాప్టర్లు, డ్రోన్లను ఆర్మీ వినియోగించింది. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను ఉపయోగించి, సైనిక కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాదు సీఆర్పీఎఫ్ దళాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు డేగ కళ్లతో నిఘావేసి, పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపలా కాస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.