యాప్నగరం

ముంబై పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష ఖరారు

1993 ముంబై పేలుళ్ల కేసుపై టాడా కోర్టు.. తీర్పు వెలువరించింది. కీలక సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంకు జీవితఖైదు విధించింది. ఇతడితో పాటు మరో ప్రధాన నిందితుడు కరీముల్లా ఖాన్‌కు జీవిత ఖైదు విధించింది. ముస్తఫా దొస్సా, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్..

TNN 7 Sep 2017, 1:42 pm
1993 ముంబై పేలుళ్ల కేసుపై టాడా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వరస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ప్రధాన నిందితులు తాహిర్, ఫిరోజ్ ఖాన్‌కు మరణశిక్ష ఖరారు చేసింది. కీలక సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంకు జీవితఖైదు విధించింది. ఇతడితో పాటు మరో ప్రధాన నిందితుడు కరీముల్లా ఖాన్‌కు జీవిత ఖైదు విధించింది. వీరిద్దరికీ తలో రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. మరో నిందితుడు రియాజ్ సిద్ధిఖీకి పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఆరో నిందితుడు ముస్తఫా దోసా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నిందుతులందరినీ టాడా కోర్టు జూన్ 16న దోషులుగా ప్రకటించింది. అదే రోజున ఏడో వ్యక్తి అబ్దుల్ ఖయ్యూంను విడుదల చేస్తూ కోర్టు ఆదేశించింది.
Samayam Telugu tada court sentences feroz khan and taher merchant to death in mumbai blasts case
ముంబై పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష ఖరారు


పోర్చుగల్‌తో ఉన్న ఒప్పందం కారణంగా ప్రధాన సూత్రధారి అబూసలేంకు మరణశిక్ష విధించనట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడుగురిని 2003 నుంచి 2010 మధ్య కాలంలో అరెస్టు చేశారు. అబూ సలేంను 2005లో పోర్చుగల్‌లో అరెస్టు చేశారు. రాయ్‌ఘడ్‌లోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న ఇతణ్ని ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. 24 ఏళ్ల తర్వాత ఈ కేసులో కీలక తీర్పు వెలువడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

1993 మార్చి 12న ముంబై నగరంలో 12 ప్రదేశాల్లో వరస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. 257 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఘటనలో మరో 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు టైగర్ మెమన్, యాకుబ్ మెమన్‌ ఈ పేలుళ్ల కుట్రకు ప్రధాన సూత్రదారులుగా గతంలోనే గుర్తించారు.

నిందితులపై బాంబు పేలుళ్లకు కుట్రపన్నడం, ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం, హత్యా నేరాల కింద కేసులు నమోదయ్యాయి. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ దేశం విడిచి పారిపోగా.. పోలీసులు యాకుబ్‌ను అరెస్టు చేశారు. 2015 జులై 30న నాగ్‌పూర్ జైలులో యాకుబ్‌కు ఉరిశిక్ష అమలు చేశారు.‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.